Vijayasanthi: భారత రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష పార్టీలు అభ్యర్ధుల ప్రకటన పూర్తి అయ్యింది. ముందుగా నిన్న మధ్యాహ్నం విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించగా, మంగళవారం రాత్రి అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ప్రకటించారు. బీజేపీ పార్లమెంట్ బోర్డులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులతో సమావేశం అయిన తరువాత బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనుండగా ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో సినీ నటీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి…విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కీలక సూచన చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Vijayasanthi: పోటీ నుండి తప్పుకోండి
ముర్ముజీ..ఒక ఉపాధ్యాయురాలు, గిరిజన మహిళ, ఆమెపై పోటీ కన్నా, సమర్ధిస్తేనే యశ్వంత్ సిన్హాజీ కూడా అభినందనీయులు అవుతారని పేర్కొన్నారు విజయశాంతి. 1998 నుండి కొన్ని సంవత్సరాల పాటు అటల్ జీ, అద్వానీజీ నాయకత్వంలో పని చేసిన సాటి కార్యకర్తగా యశ్వంత్ జీకి తన అభిప్రాయాన్ని గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఏకాభిప్రాయ నిర్ణయం రాష్ట్రపతి ఎన్నికకు మరింత విలువ తేగలదు కదా అని గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు ఎటూ గెలుపు అవకాశాలు లేకపోవడం వాస్తవ దూరం కాదన్నది ఈ సందర్భంలో గమనార్హం అని పేర్కొన్నారు విజయశాంతి.
విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా 2019 ముందు వరకూ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేత వాజ్ పేయికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత యశ్వంత్ సిన్హా.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నియమితులైయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా నిన్న ఉదయమే ఆయన పార్టీ ఉపాధ్యక్ష రాజీనామా చేశారు.