గతంలో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేశాయి.. అనంతరం ఆ కలయిక చారిత్రక తప్పిదం అని బాబు అన్నారు.. అనంతరం మళ్లీ కలిసి పోటీ చేశారు. ఈ కలయికల్లో ఎవరి అభిప్రాయాలు ఏమిటన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రస్తుతం ఏపీలో జగన్ దూకుడిని ఏమాత్రం తట్టుకోలేకపోతున్న టీడీపీ… బీజేపీ వైపు చూస్తుందని ఇన్ని రోజులూ కథనాలు వచ్చాయి. కానీ.. తాజాగా బీజేపీ నుంచి వార్నింగులు మొదలైపోయాయంట.
పరిపాలనాపరంగా, రాజకీయాలపరంగా జగన్ దూకుడును ఏమాత్రం తట్టుకోలేకపోతున్న టీడీపీ… అందుకు బీజేపీతో కలవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జగన్ ను కనీసం ధీటుగా ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం కలగడానికైనా టీడీపీ ఎవరొకరితో కలిసి పోటీ చేయాల్సిందే. ఈ క్రమంలో బీజేపీ అయితే సెంట్రల్ లో కూడా సేఫ్ అని భావించిన సంగతి తెలిసిందే. అందుకే బాబుకూడా ఈ మధ్య మోడీ భజన షురూ చేశారు! అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడు బీజేపీలో ఉన్న బాబు ఫ్యాన్స్ తోనే చిక్కొచ్చి పడింది.
జగన్ దాటికి తట్టుకోలేమనో, ఆర్థిక అవసరలాకోసమో, కష్టాల నుంచి గట్టెక్కడం కోసంఓ, మరో కారణమో తెలియదు కానీ… టీడీపీ ఎంపీలు సీరియస్ గా బీజేపీలో చేరిపోయారు. తర్వాత తెలిసింది వీరు బీజేపీపై ప్రేమతో కాదు పార్టీలో చేరింది.. బాబుకు మద్దతుగా ఉండటానికే అని! దీంతో తాజాగా నిమ్మగడ్డను పార్క్ హయత్ లో కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరి వంటి బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ సీక్రెట్ గా కలవడం బీజేపీలో పెద్ద చికాకే తెప్పించిందట.
ఇదే క్రమంలో టీవీ డిబేట్ లలో కూడా బీజేపీ నాయకులు వారి పార్టీ, వారి నాయకులు, కేంద్రంలో వారు చేస్తున్న కార్యక్రమాలకంటే మరీ ఎక్కువగా టీడీపీ ని భుజాన్న మోస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. దీంతో బీజేపీలో ఉన్న టీడీపీ మాజీ నాయకులకు వార్నింగులు పడుతున్నాయని తెలుస్తుంది. మీకు బయట లక్ష వ్యవహారాలుండొచ్చు కానీ.. పార్టీనే ప్రధానం, పార్టీలో ఉన్నంతకాలం పార్టీ విధేయులుగా ఉండండి.. సొంత పెత్తనాలు మానండి అని వార్నింగులు బలంగా పడ్డాయని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక టీడీపీ – బీజేపీ ల కూటములు చరిత్రకే పరిమితమేమో!