మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మినిస్టర్ ధనుంజయ్ ముండే పై అత్యాచారం ఆరోపణలు రావడంతో ఇన్నాళ్లు ఆయన గుట్టుగా సాగించిన వ్యవహారం బహిర్గతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలంటూ ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకీ ఆమె లేఖ రాశారు. ఓ రాష్ట్ర మంత్రిపై మరో రాష్ట్రంలో అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం అవుతోంది. 38 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే పై అత్యాచార ఆరోపణలు చేస్తూ ఒడిశాలోని అంధేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి ధనుంజయ్ స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు.
తనపై ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు అవాస్థవమన్నారు. అయితే తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ సోదరితో తాను ఏడేళ్లుగా సహజీవనం చేశాననీ, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ తెలిపారు. ఇటీవల కాలంలో ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు కూడా అంగీకరించారనిీ ధనుంజయ్ చెప్పారు. అంతా బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో సదరు అక్కా చెల్లిళ్లు డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారనీ, దీంతో తాను గత ఏడాది నవంబర్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. అయితే స్వయంగా మంత్రే ఓ మహిళతో సంబంధం కొనసాగించానని వెల్లడించడంతో పాటు ఆమె సోదరే అత్యాచార ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు. ధనుంజయ్ ముండేను మంత్రి పదవి నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ మేరకు ముఖ్యమంత్రికీ లేఖ రాశారు. అయితే దీనిపై సీఎం ఉద్దవ్ ఠాకరే ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మంత్రి ధనుంజయ్ ముండే తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి పలు మార్లు అత్యాచారంకు పాల్పడ్డారని సదరు మహిళ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ మహిళ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ మంత్రి ధనుంజయ్ తో బాధితురాలికి 1997 నుండి పరిచయం ఉందన్నారు. తొలుత బాలీవుడ్ లో సింగర్ గా అవకాశం ఇప్పిస్తానని పరిచయం పెంచుకున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే 2008లో తొలిసారిగా ఆమెపై మంత్రి అత్యాచారం చేశారనీ, ఆ తరువాత కూడా పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019లో ఆ మహిళ వివాహం చేసుకోవాలని మంత్రి ధనుంజయ్ ను కోరగా అందుకు అంగీకరించకపోతే ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాని అన్నారు. మంత్రి ధనుంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయలేదనీ, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు మంత్రి ధనుంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని బాధితురాలి తరపు న్యాయవాది అన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఇది కూడా చదవండి..బ్రేకింగ్: స్థానిక పోరు పిటిషన్ విచారణ వాయిదా