కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. అయితే కోవిడ్ వల్ల పేదరికంతోపాటు ఆకలితో అలమటిస్తున్న బాధితులకు సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితి ఫుడ్ చీఫ్ డేవిడ్ బీస్లీ బిలియనీర్లకు పిలుపునిచ్చారు.
కరోనా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ మధ్య కాలంలో మరింత సంపదను ఆర్జించారని, ప్రపంచంలో మొత్తం 2వేల మంది బిలియనీర్లు ఉన్నారని, వారు తలచుకుంటే పేదలందరూ ఆకలితో చనిపోకుండా సహాయం చేయవచ్చని అన్నారు. అందువల్ల బిలియనీర్లు పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వల్ల 270 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని, వారికి ఆహారం అందించకపోతే ఆకలితో చనిపోతారని అన్నారు.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా 138 మిలియన్ల మందికి ఐక్యరాజ్యసమితి ఆహారం అందిస్తుందని, కానీ మిగిలిన మందికి ఆహారం అందించేందుకు 4.9 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని బీస్లీ అన్నారు. కనుక ఆ మొత్తాన్ని బిలియనీర్లు సహాయంగా అందించాలని అన్నారు.
కాగా కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలోని బిలియనీర్ల సంపద 19 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రపంచంలోనే పలువురు బిలియనీర్లు ఈ కష్ట సమయంలోనూ మరింత సంపదను పొందారని, అలాంటి వారందరూ పేదల కోసం సహాయం చేయాలని బీస్లీ కోరారు.