ప్రస్తుత తరుణంలో డబ్బును పొదుపు చేసుకోవాలని చూసే అనేక మందికి అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దీర్ఘకాలిక స్కీములు కూడా లభిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి.. కిసాన్ వికాస్ పత్ర స్కీం. ఇందులో కేవలం ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే మెచూరిటీ తీరే వరకు ఆగాల్సి ఉంటుంది. తరువాతే డబ్బును విత్డ్రా చేసుకోగలుగుతారు.
కిసాన్ వికాస్ పత్ర స్కీంలో కనీసం రూ.1వేయి నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. లిమిట్ లేదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టాక మెచూరిటీ కాలం 124 నెలల వరకు ఆగాల్సి ఉంటుంది. తరువాత డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తారు. అయితే ఈ స్కీం కేవలం పోస్టాఫీస్లోనే కాక బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా సరే ఇందులో చేరి పెట్టుబడి పెట్టవచ్చు. కానీ పెట్టుబడి మొత్తం పెద్ద మొత్తంలో ఒకేసారి పెడితే దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చు.
కాగా కిసాన్ వికాస్ పత్ర స్కీంలో పెట్టే పెట్టుబడికి 6.9 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ క్రమంలో 124 నెలలకు పెట్టిన పెట్టుబడి కాస్తా రెట్టింపు అవుతుంది. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలు పెడితే రూ.20 లక్షలు పొందవచ్చన్నమాట. ఇక ఈ పథకంలో చేరాలనుకునే వారు ఇంటి చిరునామా, ఐడీ ప్రూఫ్ తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.