కోవిడ్ 19 పేషెంట్ల చికిత్సకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వైద్యులు పలు భిన్న రకాల మెడిసిన్లను, చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు మొదలుకొని ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న కోవిడ్ పేషెంట్లకు కూడా భిన్నమైన మెడిసిన్లను వాడుతున్నారు. అయితే కోవిడ్ అత్యవసర స్థితి ఉన్నవారిని ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు గాను టొసిలిజుమబ్ అనే మెడిసిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు గుర్తించారు.
టొసిలిజుమబ్ మెడిసిన్ను ఇప్పటికే రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నారు. దీని వల్ల ఆయా పేషెంట్లలో వాపులు తగ్గుతాయి. అయితే ఇదే మెడిసిన్ కోవిడ్ ఐసీయూ పేషెంట్లను ప్రాణాపాయం నుంచి తప్పిస్తుందని తేల్చారు. ఇందుకు గాను న్యూజెర్సీలోని హాకెన్సాక్ మెరిడియన్ హెల్త్ హాస్పిటల్స్లో సైంటిస్టులు ప్రయోగాలు కూడా చేశారు. కోవిడ్ బారిన పడి ఐసీయూలలో చికిత్స పొందుతున్న 630 పేషెంట్లలో కొందరికి టొసిలిజుమబ్ మెడిసిన్ను ఇచ్చారు. దీని వల్ల ఐసీయూల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లు కోలుకున్నారని సైంటిస్టులు తెలిపారు. అలాగే కొందరికి ప్రాణాపాయ స్థితి కూడా తప్పిందని తేల్చారు.
కోవిడ్ బారిన పడ్డవారిలో ఇన్ఫ్లమేషన్ (వాపులు), న్యుమోనియా ఎక్కువైతే వారు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అయితే టొసిలిజుమబ్ మెడిసిన్ ను వాడితే వాపులు, న్యుమోనియా తగ్గుతాయని దీంతో కోవిడ్ పేషెంట్లు ఎమర్జెన్సీ స్థితి నుంచి బయటకు వస్తారని సైంటిస్టులు తెలిపారు. ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందే వారికి ఈ మెడిసిన్ను ఇస్తే ఎంతో మంది చనిపోకుండా చూడవచ్చన్నారు. అయితే దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ది లాన్సెట్ రుమటాలజీ అనే జర్నల్లోనూ ప్రచురించారు.