కారణాలు ఏవైనా, ఎలాంటివైనా… శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు శాసనసభలో ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. దానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు… ఇంగ్లీష్ మీడియం విషయంలో పేదలకు న్యాయం జరగకుండా చేయడానికి మండలిలోని టీడీపీ పెద్దలు నిర్ణయించుకున్నారనేది ఒకటి కాగా… అభివృద్ధి మొత్తం అమరావతికే పరిమితమవ్వాలనే నీచ ఆలోచన చేయకుండా.. పరిపాలనా వికెంద్రీకరణ అనే ఆలోచన చేసిన బిల్లును కూడా కాదన్నందుకు. ఏది ఏమైనా మండలి రద్దుకే జగన్ సర్కార్ మొగ్గుచూపింది. దీనివల్ల లోకేష్ తో సహా చాలా మంది ఉద్యోగాలు పోనున్నాయి!!
ఆ సంగతి అలా ఉంచితే… రద్దు ఆలస్యం అవుతుందనో లేక అవుతుందో లేదో అనో తెలియదు కానీ… శాసనమండలిలో కూడా బలం పెంచుకోవాలనే ఆలోచనకు తెరలేపారు జగన్. మండలి రద్దు బిల్లు కేంద్రానికి పంపినా కూడా అది ఎపుడు పాస్ అవుతుందో, అసలు పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో రద్దు సంగతి కాసేపు పక్కనపెట్టి… మండలిలో కూడా తిరుగులేని బలం సంపాదించుకునే దిశగా జగన్ పావులు కదుపుతున్నారు.
కొత్తగా వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తో కలుపుకుని, వైసీపీకి ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, మోపిదేవి, బోసు రూపంలో మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీలైనంత తొందర్లో ఈ నాలుగు కూడా వైసిపీ ఖాతాలో వెళ్తాయి. ఇదే క్రమంలో వచ్చే జూన్ నాటికి ఈ నాలిగిటితో కలుపుకుని 25 స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో 12 స్థానాలు ఖాళీ అవ్వగా, మిగతా 7 స్థానిక సంస్థల నుంచి ఎన్నిక అయ్యేవి.. ఇవన్నీ ఎలాగూ వైసీపీ గెలుచుకుంటుంది. సో… వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించేస్తే… ఇక మండలిలో కూడా వైకాపాకు తిరుగులేని బలం వచ్చే అవకాశాలున్నాయి!