జగన్ ఏమి చేసినా తప్పనే ఒక వర్గం మీడియా కూడా కరోనా విషయంలో జగన్ చేస్తున్న చర్యలను, దాని నివారణకు సీఎం తీసుకుంటున్న చర్యలను అభినందించకుండా ఉండలేకపోతున్నాయన్నా అతిశయోక్తి కాదేమో! దేశంమొత్తం మీద అత్యధిక సంఖ్యలో టెస్టులు చేయడమే కాకుండా… బిక్షగళ్ల దగ్గరనుంచి అందరి ఆరోగ్యం విషయంలో చూపిస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న చర్యలు అభినందనీయమనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పరీక్షల సంఖ్యను విపరీతంగా పెంచుతూ.. చాలా వేగంగా టెస్టులు చేస్తుంది. ఇదిలా ఉంటే… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం, అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో… రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10కి పెంచుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా చేయడంలో భాగంగా.. నాణ్యమైన సేవలను అందించే ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే జిల్లాల్లో ఉన్న సుమారు 85 ఆస్పత్రుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. ఆయా ఆస్పత్రుల్లో మరింతగా ఏమి చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలని సిఎం జగన్, అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రుల్లో వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని.. కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భారీ ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు.