అమరావతి, మార్చి 25: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 15 వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
వివేకా మరణంపై అధికార, విపక్షాల మధ్య విమర్శల దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆయన భార్య సౌభాగ్యమ్మ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సౌభాగ్యమ్మ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత జగన్, మరొకరు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నారు. మూడు పిటిషన్లపై విచారణను ధర్మాసనం మంగళవారంకు (రేపటికి) వాయిదా వేసింది.
సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికే ఈ కేసు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోంశాఖకు పిర్యాదులు అందజేసిన విషయం తెలిసిందే.