శిరోముండనాలు.. దళితులపై దాడులు.., మాస్కు లేదని పోలీసుల చితక్కొట్టుడు.., ఇవన్నీ ఈ ప్రభుత్వానికి తలవంపులే..! సీఎం జగన్ పాలనలో చెరిగిపోని మచ్చలే..! తాజాగా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన మరో సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అధికారులకు కళ్ళు నెత్తికెక్కి.., అధికార మదమెక్కి.., సాటి మనుషులే బాధితులు అనే ఇంగితాన్ని మర్చిపోయి.. ఓ పిల్లాడిని తీవ్రంగా గాయపర్చారు. ఓ తల్లి చేయి విరిచారు. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసారు. కొన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. గ్రామస్థుల ఆగ్రహాలకు కారకులయ్యారు..!!
ఓ వైపు చర్చలు.. మరోవైపు కూల్చివేతలు..!!
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి చిత్రావతి జలాశయం ముంపు గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామస్థులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని.., పెంచాలంటూ కొద్ది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొందరు అధికారులు ఈ గ్రామానికి చర్చలకు వచ్చారు. వస్తూనే జేసీబీలు తీసుకువచ్చారు. పరిహారం కోసం గ్రామపెద్దలతో ధర్మవరం ఆర్దీవో మధుసూధన్ చర్చలు జరుపుతున్నారు. ఇరు వర్గాల్లో ఓ రాజీ సూత్రం రావడం లేదు. ఎవరి మాట వారిదే అయి ఉంది… ఈ క్రమంలోనే కొందరు క్షేత్రస్థాయి అధికారులు అత్యత్సాహంతో గ్రామస్థులను భయపెట్టడానికి జేసీబీలతో ఇళ్ల కూల్చివేత మొదలు పెట్టారు. ఓ ఇంట్లో నాగచైతన్య అనే అయిదేళ్ల బాలుడు, తల్లితో సహా ఉండగా… ఈ ఇంటిని కూల్చేశారు. ఈ గోడ శిథిలాలు ఆ ఇద్దరిపై పడ్డాయి. బాలుడి తలకు తీవ్రంగా గాయాలవ్వగా.., ఆ తల్లి పర్వతమ్మకి చేయి విరిగింది.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం..!!
ఈ ఘటనతో గ్రామస్థుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. జేసీబీపైనా, ఆ అధికారులపైనా రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఆర్దీవో మధుసూదన్ ఒక్కసారిగా గ్రామస్థులకు క్షమాపణలు చెప్పి, బాలున్ని ఆసుపత్రికి పంపించారు. ఆ మహిళకి చేతికి చికిత్స చేయించారు. బాలుడికి మాత్రం తలకు పెద్ద గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం సిఫార్సు చేసారు. గాయాలతో కోలుకుంటే కోలుకోవచ్చు.. కానీ ఆ కుటుంబాల రోదనలకు.., ఆ కూలిన ఇళ్లకు బాధ్యత ఎవరిది..!? ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కళ్లెదుటే సాక్ష్యాలున్నాయి. బాధితులున్నారు. బాధ్యులున్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం కచ్చితంగా అధికార మదమే. కళ్ళు నెత్తికెక్కడమే. బాధ్యతా రాహిత్యమే. ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంటుందా..? అధికారులను, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటుందా..? లేదా తేలిగ్గా తీసుకుని సమర్ధించుకుంటుందా..? రాజకీయం చేసి, రంగులు వేస్తుందా..? అనేది చూడాలి..!!