ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు ప్రధాని మోడీ కి లెటర్ రాయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ న్యాయవాది ప్రముఖ న్యాయవాది శ్రవణ్ తో పాటు హైకోర్టులో వేసిన పిల్ విచారణకు వచ్చింది. హైకోర్టు దృష్టికి వచ్చిన ఈ తతంగం మొత్తం విషయంలో పిటిషనర్ లాయర్ శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జడ్జి కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు, అందుకోసం స్పెషల్ టీములు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికే ఐదు లాయర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని శ్రవణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ తతంగం మొత్తం ఒక ఉన్నత పోలీస్ అధికారి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు…. న్యాయస్థానం వెంటనే అతన్ని కోర్టు బోనులో నిలబెట్టే రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మీ దగ్గర ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అంటూ శ్రవణ్ ని కోర్టు ప్రశ్నించింది. ఉంటే ఆధారాలు వెంటనే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. దీంతో న్యాయవాది శ్రవణ్ అదనపు సమాచారం తో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయస్థానానికి తెలిపారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వంతో పాటు సర్వీస్ ప్రొవైడర్ లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మొత్తంమీద చూసుకుంటే జరిగిన విచారణలో న్యాయమూర్తి శ్రవణ్ పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారిని కోర్టులో నిలబెట్టాలని బలమైన వాదన వినిపించడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. మరి ఇప్పుడు ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉండగా దీనిపై అసలు విచారణ ఎందుకు ఆదేశించకూడదో అంటూ అడ్వకేట్ జనరల్ ని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన న్యాయవాది ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోపక్క వైసీపీ పార్టీ మద్దతుదారులు ఇదంతా టీడీపీ కి సపోర్ట్ చేసే మీడియా పొలిటికల్ గేమ్ అని ఆరోపిస్తున్నారు.