ఏపీ పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన విశాఖపట్టణంలో అభివృద్ధిలో సైతం అదే రీతిలో ముందుకు సాగుతోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. నగరంలో ఎల్ఐసీ భవన్ మూడో అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
విశాఖలో మెట్రో లెక్క ఏందంటే…
విశాఖలో 79,91 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60.29 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్ను అధికారులు పరిశీలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం కానున్నాయి. డీపీఆర్లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
బొత్స కీలక వ్యాఖ్యలు
మెట్రో రైలు గాజువాక కొమ్మాది వరకు మొదట అనుకున్నామని…ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ను కలుపుతూ భోగాపురం వరకు మెట్రో రైలును పొడగించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్బంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సంస్థ ఎండీ రామకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ మొదటివారం నాటికల్లా…పూర్తి డిపిఆర్ సిద్ధం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఆమోదం పొందాక టెండర్లు ఖరారు చేస్తామన్నారు. సబ్ లైన్ కారిడార్ గురుద్వారా నుంచి పాతపోస్టాఫీస్ వరకు వస్తుందన్నారు. మొత్తం 79.91 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు వస్తుందని, కిలోమీటర్కు 200 నుంచి 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచన, విజన్తో విశాఖకు మెట్రో కేటాయించారు. విశాఖకు మెట్రో రైల్ వస్తే ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయి. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.