Jc Prabhakar Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో వస్తున్న ఫలితాలు చూస్తుంటే చాలా వరకు తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. పార్టీ గుర్తు పై జరిగిన ఈ ఎన్నికలలో.. ప్రజలు ఇంకా జగన్ వైపే ఉన్నట్లు ఫలితాలను బట్టి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వకుండా వైసిపి మెజార్టీ స్థానాలు గెలిచి దూసుకుపోతుంది. ఆఖరికి గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో కూడా వైసీపీ గెలవడంతో అమరావతి రాజధాని విషయంలో ప్రజలు టీడీపీని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అని మరోసారి రుజువయ్యింది.
ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ గెలవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇది తాడిపత్రి ప్రజలు ఇచ్చిన విజయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీకి తొలి గెలుపు కావటంతో .. ఈ గెలుపు జేసీ బ్రదర్స్ ప్రాబల్యం వల్లే అన్న టాక్ పార్టీలో ప్రస్తుతం బలంగా వినపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. “సేవ్ తాడిపత్రి” అనే నినాదం ఎన్నికల ప్రచారంలో బలంగా పని చేసిందని .. తాడిపత్రి ప్రజలే గెలుపు కి కారణం అని తెలిపారు.
అదేవిధంగా టీడీపీకి బలం కార్యకర్తలు అని.., నాయకులు భయపడి ఇళ్లల్లో ఉంటే కార్యకర్తల కృషి వల్ల తాడిపత్రిలో ఈ విజయం సాధించడం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అధికార పార్టీ భయబ్రాంతులకు గురి చేయటం జరిగిందని, తనని దాదాపు 9 నెలల పాటు నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేశారని, కానీ ఇంతటి ఘన విజయం సాధించడం వెనకాల జేసీ దివాకర్ రెడ్డి మరియు పవన్ రెడ్డి కృషి కూడా ఉంది అని పేర్కొన్నారు. నామినేషన్లు వేయాల్సిన సమయంలో అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని కానీ ఎక్కడా క్యాడర్ వెనుకడుగు వేయలేదు .. కేవలం ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణం తాడిపత్రి పబ్లిక్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.