ఉరుము ఉరిమి మంగళం పడినట్లు అన్న సామెత మీకు తెలుసుగా…ఇక్కడ అటువంటిదే జరిగింది. ప్రకాశం జిల్లాలో కరోనా వైద్య ఆరోగ్య శాఖ దిగువ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వైరస్ అనుమానితుల నుండి సేకరించిన సుమారు 27 వేల నమూనాలు, కిట్లు వృధా అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుండి నమూనాల సేకరణలో సిబ్బంది పొరపాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. సేకరించిన నమూనాలకు ఐడి నెంబర్లు వేయక పోవడం, మూతలు లేకుండానే కొన్నింటిని ల్యాబ్ కు పంపడం, టెస్టింగ్ కేంద్రాలలో నమూనాలను పక్కకు పెట్టడం లాంటి నిర్లక్ష్యాలను కలెక్టర్ శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఎత్తిచూపారు. ప్రభుత్వం ఒక్కో కరోనా టెస్ట్ కు 1100రూపాయలు ఖర్చు చేసుంటే సిబ్బంది ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా అంటూ మందలించారు. సిబ్బంది పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అయితే కలెక్టరే నేరుగా విషయాన్ని బాటపెట్టి సంబంధిత సిబ్బందిని మందలించగా, ఇప్పుడు ఆయనే ముద్దాయి అయిన పరిస్థితి ఎదురైంది.
జిల్లాలో 27వేల కరోనా కిట్లు వృధా అవ్వడంపై నేడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. దీనికి జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణం అని ఆరోపించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 27వేల కిట్లు వృధా అయ్యాయి అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు. జిల్లాలో జరిగిన ఈ ఘటనకు జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని అయన డిమాండ్ చేయడం చేశారు. జరిగిన తప్పిదాన్ని కనిపెట్టి సంబందింత సిబ్బందిని మందలించిన జిల్లా అధికారినే బాద్యుడుగా పేర్కొంటూ ఎమ్మెల్యే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అంటున్నారు.
అయితే ఎమ్మెల్యే సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ పోలా భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఒక్క రోజు కలెక్టర్ గా ఎవరైనా పనిచేస్తానంటే ఆసక్తి ఉంటే రండి.. నేను ఇస్తాను ఛాన్స్ అంటూ సవాల్ విసిరారు. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక రోజు సిఎంలాగా ఎవరైనా వచ్చి ఒక రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా చేయవచ్చు, మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాము. మా కంటే గొప్పగా ఎవరైనా బాగా పనిచేస్తారంటే రండి ఒకరోజు కలెక్టర్ గా పని చేయండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరోపణలు, కలెక్టర్ గట్టి కౌంటర్ ఇవ్వడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.