కొద్దిరోజుల కిందట మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే, సొంత బావమరిది నందమూరి బాలకృష్ణ చేసిన సూచనకు పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చెప్పి
ఏపీ టీడీపీ కొత్త కమిటీ ప్రకటనకు సర్వం సిద్ధం అయిపోయినప్పటికీ పక్కన పెట్టేశారని ప్రచారం జరిగింది. అయితే, అలా బాలయ్య మాటను విన్న చంద్రబాబు ఇప్పుడు మరో కీలక విషయంలో ఆయన స్ఫూర్తిని ఎందుకు పాటించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు, బాలకృష్ణ … అసలేం జరిగింది?
ఎన్నికల్లో ఓటమి అనంతరం సామాజిక సమీకరణలు, యువ నేతలకు ప్రాధాన్యం అనే కోణంలో దాదాపు 6 నెలల సుదీర్ఘ కసరత్తుతో చంద్రబాబు రాష్ట్ర కమిటీలను ఫైనల్ చేశారట. గతనెల నుంచి ప్రతివారం ఇదిగో ప్రకటన.. అదిగో ప్రకటన అని ప్రచారం జరుగుతుంది తప్ప.. లిస్ట్ మాత్రం విడుదల చేయలేదు. అయితే, ఇదే సమయంలో ఓ టాక్ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు ప్రకటన చేయకపోవడానికి కారణం ఎమ్మెల్యే బాలయ్యేనని, బావమరిది సూచన మేరకే రాష్ట్ర కమిటీ ప్రకటన ఆగిందని టాక్ వచ్చింది. టీడీపీ విపక్షంలోకి వచ్చాక వాస్తు వ్యవహారాలు, మంచి రోజులు చూసుకునే విధానం బాగా ఎక్కువైందట. దీనిపై పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.ఈ ప్రకారం ఈ నెల 18 తర్వాత కమిటీలను ప్రకటించాలని బాలకృష్ణ సూచిస్తే, చంద్రబాబు ఓకే చెప్పారట.
బాలకృష్ణం ఏం చేశాడో తెలుసా బాబు?
అయితే, ఇప్పుడు బాలకృష్ణ చేసిన పని చర్చకు తెరలేపింది. హైదరాబాద్ను వరదలు ముంచెత్తుతున్న సమయంలో బాలయ్య తన పెద్ద మనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు ఒక కోటి 50 లక్షలు విరాళాన్ని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తాజా వరదలకు రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించాలని నందమూరి బాలకృష్ణ సూచించారు.
బాబు గారు ఎక్కడ?
అయితే, హైదరాబాద్ను వరదలు ముంచెత్తుతున్న సమయంలో అదే నగరంలో ఉన్న చంద్రబాబు ఈ వరదలపై స్పందించకపోవడం గమనార్హం. ఆయన సారథ్యంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ట్రస్టు ద్వారా చంద్రబాబు తన పరిధిలో సహాయం చేయవచ్చు. కానీ చంద్రబాబు అలాంటిదేమీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ ఉందని ప్రకటించుకునే చంద్రబాబు, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతను అని క్లెయిం చేసుకునే నాయకుడు ఇలా వ్యవహరించడం ఏంటని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.