ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన సోము వీర్రాజు మంచి దూకుడు మీద వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ కోటలు బీటలు పడుతున్న తరుణంలో … ఎలాగైనా ఆ స్థానాన్ని భర్తీ చేసి ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషింప చేయడానికి సోము వీర్రాజు రాజకీయ ఎత్తుగడలు తనదైన శైలిలో వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవి ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత సోము వీర్రాజు ట్విటర్లో పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసుకోవాలని చిరంజీవి చెప్పారు అంటూ పేర్కొన్నారు. పార్టీని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా అడుగులు వేస్తామని, ముందుకు వెళ్తామని చిరంజీవి చెప్పిన సూచన తప్పక పాటిస్తామని బీజేపీ- జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతామని అంటూ తెలిపారు.
ఇది ఇలా ఉండగా సోము వీర్రాజు చిరంజీవి ని కలవటం పట్ల ఏపీ రాజకీయాల్లో భిన్నమైన కామెంట్లు వినబడుతున్నాయి. మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ తో పని చేయాలంటే చిరంజీవితో బిజెపి అధ్యక్షుడు మాట్లాడాల్సింది ఏముంది అంటూ డిస్కషన్లు వినబడుతున్నాయి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తమవైపు తిప్పుకోవడం కోసం… బిజెపి పార్టీ స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తుందని మేధావులు అంటున్నారు.
ఏపీ లో ఎక్కువ ఓటు బ్యాంకు కలిగిన వాళ్లు దళితులు మరియు కాపులు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల కి దాదాపు అయోధ్యలో నిర్మించబోతున్న రామమందిరాన్ని హైలైట్ చేస్తూ హిందుత్వా ఎజండా, సెంటిమెంట్ తో ఎన్నికల ప్రచారానికి బిజెపి స్ట్రాటజిక్ గా ప్రజలలోకి వెళ్లే అవకాశం ఉందని టాక్. అయితే రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంకు ఎలాగో వైసీపీ పార్టీ వైపు ఉండటంతో…. మిగిలి ఉన్న కాపు ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవడానికి కమలం పార్టీ పెద్దలు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకోసం బీజేపీ హైకమాండ్ ఏపీలో కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా, ప్రముఖుడిగా పేరొందిన చిరంజీవి ఫ్యామిలీ ని లైన్ లో పెట్టడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు. ఇదిలాఉండగా మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ తో నేరుగా సంప్రదించకుండా సోము వీర్రాజు చిరంజీవితో భేటీ కావడం, తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలని చిరంజీవి చెప్పినట్లు సోము చెప్పటం, ఇది నిజంగా పవన్ కి పెద్ద ట్విస్ట్ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.