DMK : త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో జరగబోయే ఎన్నికలలో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఎవరికి వారు ఎన్నికల వ్యూహాలతో ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే పార్టీ ఉంది. ఈ క్రమంలో తాజాగా డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తాజాగా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు పది సంవత్సరాల తమిళనాడు భవిష్యత్ ఉద్దేశించి పార్టీ అధినేత స్టాలిన్ అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఏడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు.
ఈ నేపథ్యంలో తమిళనాట యువతకు 75 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు వంతున కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల ప్రజలను పేదరికం నుండి కాపాడతామని తెలిపారు. అంత మాత్రమే కాక రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించడంతోపాటు మంచినీటి వృధాను అరికడగతామని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థులకు ప్రస్తుతం వస్తున్న స్కాలర్షిప్లను డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఇంటిలో ఉన్న మహిళకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందించనున్నట్లు రేషన్ కార్డు ఉంటే చాలు నెలనెలా వెయ్యి రూపాయలు పెన్షన్ గృహానికి అందించనున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక రాష్ట్ర బడ్జెట్లో 1.9 శాతంగా ఉన్న ఎడ్యుకేషన్ బడ్జెట్ను 6 శాతానికి, 0.75 శాతం ఉన్న ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను 2 శాతానికి పెంచుతామన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ మరియు స్కూల్ నిర్మించడంతో పాటు దానికి తగ్గ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో 10 ఇయర్స్ విజన్ అంటూ పార్టీ అధినేత స్టాలిన్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు.