విజయవాడ, జనవరి 24: దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లో, కులాల్లో, వర్గాల్లో ఉన్న విషయాన్ని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు.
వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా గురువారం విజయవాడలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వైసిపిలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదరయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవమానాలు ఎవరికీ జరగకూడని రాధా అన్నారు. తాను పార్టీపై అభిమానంతో అందులో ఉంటే, వారేమో తనపై జాలి చూపిస్తున్నామన్నారని రాధ పేర్కొన్నారు.
జగన్మోహనరెడ్డికి తనపై అభిమానం ఉంటే ఒక్క సారి అయినా ఫోన్ చేశారా అని ప్రశ్నించారు. ఈ పార్టీలో కొనసాగితే తన తండ్రి రంగా అభిమానులకు న్యాయం చేయలేననే బయటకు వచ్చానని రాధ స్పష్టం చేశారు.
తన తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే విగ్రహావిష్కరణకు వెళ్లానని, దాన్ని వారు తప్పుగా భావిస్తే తాను చేసేది ఏమీలేదని రాధ అన్నారు.
తండ్రి లేని వాడివని చేరదీశానని, చెప్పినట్లు వినాల్సిందేనని వైఎస్ జగన్ ఒత్తిడి చేసేవారని రాధ ఆరోపించారు.
ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలని రాధ హితవు పలికారు.
తనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని రాధ అన్నారు. వీటిపై తాను తల్చుకుంటే ఎపి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేవాడినని రాధ చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా జీవితంలో కొనసాగాలను కుంటున్నానని రాధ స్పష్టం చేశారు.
కొందరు వ్యక్తుల చర్యలను అందరికీ ఆపాదించడం, పార్టీకి ఆపాదించడం కరెక్టు కాదని మీడియా వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాధ చెప్పారు.
టిఆర్పి రేటింగ్ల కోసం ఛానల్స్ వారు తప్పుడు కధనాలు ప్రసారం చేయవద్దని రాధ సూచించారు.