అమరావతి, జనవరి 24: కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీతో, డబ్బులకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజీపడ్డారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విడిగా పోటీ చేసేందుకు చంద్రబాబు కాంగ్రెస్కు నిధులు ఇస్తున్నారన్న వైసిపి ఆరోపణలపై స్పందించారు. తెలంగాణాలో పోటీచేయనందుకు వైసిపికి ఎంత ముట్టిందో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు
మీ ప్రాణం మీ రిమోట్ మోదీ చేతిలోనే ఉన్నాయని జగన్ను ఉద్దేశించి ఆయన అన్నారు. జగన్కు రాష్ట్ర ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. వైసిపికి తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అలవాటని ఆయన వ్యాఖ్యానించారు.
తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి వంగవీటిని జగన్ మోసం చేసాడని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ద్వారానే హోదా వస్తుందని తెలుగుదేశం పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు.