(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖలోని నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో జరిగిన శిరోముండనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో సహా ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
సిసి టీవీ పుటేజ్లో మరో సాక్షం
నూతన్ నాయుడు నివాసంలో పని చేస్తూ మానేసిన కర్రి శ్రీకాంత్ అనే దళిత యువకుడిని సెల్ ఫోన్ చోరీ చేశాడన్న అభియోగం మోపి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి అతన్ని తీవ్రంగా కొట్టి గుండు గీయించిన (శిరోముండనం) సంఘటనలో వారి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సిసి కెమెరాల సాక్షంగానే నూతన్ నాయుడు భార్య అడ్డంగా బుక్ అయ్యింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ బయటపడింది. వాళ్లు ఏదో ఘన కార్యం చేస్తున్నట్లు యువకుడికి గుండు చేస్తున్న దృశ్యాలను ఒ మహిళ తన సెల్ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి ఎవరికో చూపించింది. ఈ ఘటన మొత్తం సిసి పుటేజీలో రికార్డు అయ్యింది. ఇది గుర్తించిన పోలీసు అధికారులు తాజాగా ఆ మహిళ ఎవరికి వీడియో కాల్ చేసింది? ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా? అనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులూ చెప్పారు
బాధితుడు కర్రి శ్రీకాంత్ ఫిర్యాదుతో వెంటనే స్పందిన పోలీసులు నూతన్ నాయుడు ఇంటికి వెళ్లి సిసి టివి పుటేజీ స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల వారిని పోలీసులు విచారించగా, నూతన్ నాయుడు ఇంటి నుండి అరుపులు వినిపించాయనీ, శ్రీకాంత్ అనే యువకుడికి గుండు కొట్టించి బయటకు తీసుకురావడం చూశామనీ ఇరుగుపొరుగు వారు తెలియజేశారు.