(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టిడిపి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కరోనా నుండి కోలుకున్నారు. ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్టు అయిన అచ్చెన్నాయుడుకు హైకోర్టు మూడు రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇఎస్ఐ పరికరాల కొనుగోళ్ల వ్యవహరంలో అచ్చెన్నాయుడును ఎసిబి అధికారులు అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు. జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు అస్వస్థతగా ఉండటంతో రమేష్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందజేశారు. ఆ సమయంలోనే అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. దీంతో ఆయనను రమేష్ ఆసుపత్రి నుండి మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించారు.
తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావడంతో సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు బయలుదేరారు. ఇటీవలే కరోనాతో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కావడంలో పలువురు టిడిపి నేతలు అచ్చెన్నాయుడుని కలిసి పరామర్శించారు.