టీడీపీని నాశనం చేయాలనుకుంటున్నది ఎవరు..? బీజేపీ, వైసీపీ..!!
చంద్రబాబుని అసలు మళ్ళీ రాజకీయంగా లేవకుండా చేస్తున్నది ఎవరు..? బీజేపీ, వైసీపీ..!!
గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలే రావడంలో వైసీపీకి పరోక్షంగా సాయపడింది ఎవరు..? బీజేపీ, టీఆరెస్..!!
ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంటె, వారిని టార్గెట్ చేయకుండా.., ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తున్నది ఎవరు..? బీజేపీ..!!
ఇన్ని చేసిన బీజేపీపై ప్రతీకారంగా చంద్రబాబు ఏమైనా చేస్తున్నారా..? అంటే మళ్ళీ ఆ పార్టీ చంకన ఎక్కి కూర్చోవాలి అనుకుంటున్నారు.., మోడీకి జై కొట్టాలనుకుంటున్నారు.., ఢిల్లీ వెళ్లి చాకిలబడాలనుకుంటున్నారు..!! ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వణుకుడు కనిపిస్తుంది. ఇది చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థుల్లో.., బాబు బద్ధ శత్రువులో అంటున్న మాట కాదు.., సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. నిరాశ పడుతున్నారు. చంద్రబాబులో చాణక్యత, తెగువ చూద్దామంటే అసలు చూపించట్లేదు అంటూ తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సందులో దూరి మరీ పొగడ్తలు..!!
చంద్రబాబుకి అవకాశం వచ్చిన ప్రతీసారి బీజేపీని, మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పొగడ్తల్లో ముంచేస్తున్నారు. ఎక్కడా ఏమాత్రం సంకోచించకుండా మోడీ భజన చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక సార్లు మోడీ భజన చేసేందుకు స్వయానా చంద్రబాబు చిడతలు పట్టుకున్నారు. ఇటీవల ఏపీలో ఫోన్ టాపింగ్ అంశంపై పిర్యాదు చేసినప్పుడు కూడా “మీరు అద్భుత పాలన, మీ పాలనలో దేశం ముందుకు వెళ్తుంది, రక్షణ రంగం బలీయమైంది” అంటూ బిస్కట్లు వేశారు. ఈరోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కరచాలనం చేసిన ఫోటో పోస్ట్ చేసి.., రెండు బిస్కట్లు వేశారు. ఇటు రాష్ట్రంలో బీజేపీ నేతలు బాబుని, టీడీపీని టార్గెట్ చేసి ఎన్ని విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఏమి అనట్లేదు.
రాజ్యసభలో వంగినట్టే..!!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగానూ చంద్రబాబు వణుకుడు బయటపడింది. రాజ్యసభలో బీజేపీ (ఎన్డీఏ)కి తగిన బలం లేదు. అందుకే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వారికి ప్రతీ ఓటు ముఖ్యమే. ఈ క్రమంలోనే ఎన్డీఏ తరపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు పోటీలో నిల్చుంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్ వైసీపీ అధినేతకు ఫోన్ చేసి మద్దతు అడిగారు. బీజేపీ కూడా పరోక్షంగా సాయం కోరింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక్క ఓటు ఉంది. కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్టీని ఎవరూ అడగకపోయినా ఎన్డీఏ అభ్యర్ధికి వేస్తాం అంటూ చెప్పుకుని మరీ భజన చూపించారు. ఈ ఎన్నిక సందర్భంగానూ బాబు భయం స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ చాకచకార్యంగా వ్యవహరించారు. అసలు ఎవరికీ ఓటు వేయకుండా తప్పించుకున్నారు. ఇక్కడే బాబు దొరికిపోయారు. ఎవరూ అడగకపోయినా, బీజేపీ చంకన ఎక్కే ప్రయత్నంలో ఓటు వేసి బాకా ఊదేశారు.
ఫార్టీ ఇయర్స్ ఎందుకున్నట్టు..??
ఓ వైపు వైసీపీ దెబ్బలు కొడుతోంది. మరో వైపు బీజేపీ పెద్ద కర్రతో కొడుతోంది. రాజకీయంగా ఏ పక్షమూ సహకరించడం లేదు. తాను సిద్ధంగా ఉన్నా బీజేపీ ఏ మాత్రం బాబుని కలుపుకోవడం లేదు. మోడీ, అమిత్ షా అసలు పట్టించుకోవడం లేదు. ఈయన ఏం అడిగినా ఎవరో తెలియనట్టు పొమ్మంటున్నారు. కానీ బాబు ఎందుకో ఇంకా బీజేపీ, మోడీకి వణుకుతున్నారు. జగన్ కి తప్పదు. చాల కేసులున్నాయి. ఏ క్షణాన అయినా లోపల వేస్తారేమో అనే భయం ఉంటుంది. కానీ బాబుకి ఏం భయం..? ఈ వయసులో ఏ కేసు వేస్తే ఏముంది..? 20 మంది ఎమ్మెల్యేలతో సాధించేది ఏముంది..? వెళ్తే జైలుకి వెళ్లి… తిరిగి వచ్చి తెగించి పోరాడవచ్చుగా…!! క్షేత్రస్థాయిలో బలం, బలగం ఉన్నప్పటికీ చంద్రబాబు రాజకీయ పరిణితి, తప్పటడుగులు టీడీపీని మరింత దిగువకు జారేస్తున్నాయి. బీజేపీ శత్రుపక్షాలను కూడగట్టి.., తెగువ చూపి పోరాటం చేయకుండా జూమ్ కి పరిమితమై, రోజూ ఆ సోది చెప్పుకుంటూ ఎన్నాళ్ళు ఈ రాజకీయం చేయడం..? అంటూ సొంత కార్యకర్తలే లోలోపల మధన పడుతున్నారు.