Bandi Sanjay : బండి సంజయ్ …. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ఎంపీ. తనదైన దూకుడు నిర్ణయాలతో పార్టీ పెద్దల దృష్టిలో పడి అనూహ్య రీతిలో ఆయన అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. పదవి దక్కిన అనంతరం కూడా అదే డైనమిజంతో ముందుకు సాగుతున్న బండి సంజయ్ తాజాగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఉప ఎన్నిక విషయంలో తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ప్రతి ఎన్నికా ప్రతిష్టాత్మకమే….
దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో బీజేపీలో జోష్ రాగా పక్కా ప్రణాళిక వల్ల జీహెచ్ఎంసీలో ఆ ఊపు కొనసాగించింది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో గట్టి పోటీనే ఇచ్చింది. అయితే, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సాగర్పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా, పార్టీ కార్యాలయంలో నల్లగొండ జిల్లా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు.
ఫోకస్ మారింది…
నాగార్జున సాగర్పై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాగార్జున సాగర్లో పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు బండి సంజయ్ పార్టీ నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.