మునవర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోకు హైదరాబాద్ పోలీసు అనుమతి లభించింది. రేపు శిల్పకళా వేదిక లో మునావర్ .. షో నిర్వహించనున్నారు. ఇప్పటికే మునావర్ షో కు అనుమతి ఇవ్వొద్దు అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరిస్తూ వచ్చారు. ఓ వర్గం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్ పై ఆరోపణలు వచ్చాయి. మరో వైపు కర్ణాటక ప్రభుత్వం మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మునావర్ షోకు అనుమతి ఇస్తే వేదికను తగులబెడతామనీ, ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నగరంలోని రాజాసింగ్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ను బయటకు రావద్దని చెప్పినా వినలేదనీ, దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. బీజేవైఎం నేతలు డీజీపీని కలిసి మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దంటూ వినతి పత్రం కూడా ఇచ్చారు. ఓ వైపు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికల నేపథ్యంలో మునావర్ షోకు అనుమతి లభించడంతో రేపు నగరంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
మరో పక్క ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. మునావర్ ఫారుకీ షోను అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు రాజాసింగ్. ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ నుండి సస్పెండ్ చేసినా భయపడనని పేర్కొన్నారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటే నుపూర్ శర్మ మాదిరిగా తనను పార్టీ సస్పెండ్ చేయవచ్చని చెప్పారు. రేపు అమిత్ షా సభకు తాను హజరు కావడం పోలీసుల మీద ఆధారపడి ఉందని అన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా మోడీ, అమిత్ షా లకు ఫాలోవర్ గా ఉంటానని పేర్కొన్నారు. పార్టీ కంటే ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని అన్నారు రాజాసింగ్. హింధువులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే మునావర్ షో నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీతారాముళ్లను కించపరిచిన వ్యక్తికి కేటిఆర్ అండగా నిలవడం శోచనీయమని అన్నారు. షో లోపలే మునావర్ పై దాడి చేసేందుకు ప్లాన్ చేశామనీ, షోకి ఎంట్రీ పాస్ లను కూడా తమ వాళ్లు సంపాదించారని చెప్పారు రాజాసింగ్. రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో మునావర్ షో నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.