MP Nama Nageswara Rao: టీఆర్ఎస్ (TRS) లోక్ సభాపక్ష నాయకుడు, ఖమ్మం (Khammam) పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాక్ ఇచ్చింది. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై విచారణ చేపట్టిన ఈడీ నామాకు సంబంధించిన మధుకాన్ సంస్థలకు చెందిన రూ.96.21 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ మేరకు రీసెంట్ గా ఈడీ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. విషయం ఏమిటంటే..
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుండి జంషేడ్ పూర్ వరకూ 163 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ ల రోడ్డు నిర్మాణానికి నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ 2011 లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) నుండి కాంట్రాక్ట్ పొందింది. ఈ రహదారి నిర్మాణం కోసం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుండి రూ.1050 కోట్లు రుణం తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పాటు 50.24 శాతం మాత్రమే పనులు చేసి చేతులు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో సీబీఐకి ఎన్ హెచ్ ఏఐ ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణానికి 90 శాతం మేర రుణం పొంది పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొనగా 2019 లో మధుకాన్ సంస్థ పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాంచీ ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని నామా నాగేశ్వరరావు, కంపెనీ ప్రమోటర్లు నామా సీతయ్య, కమ్మ శ్రీనివాసరావు, నామా పృధ్వీతేజ లు కుట్ర పూరితంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తమ ఇతర ప్రాజెక్టులోకి నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు రూ.75 కోట్లకు పైగా నిధులను ఉషా ప్రాజెక్టు, శ్రీ బీఆర్ విజన్స్ , శ్రీ ధర్మశాస్త కన్ స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్ స్ట్రక్షన్స్, రాగిని ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్ స్ట్రక్షన్స్, లోకి మళ్లించినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది. గత ఏడాది జూన్ నెలలో మధుకాన్ చైర్మన్ నామా నాగేశ్వరరావు కార్యాలయం, నివాసం, కంపెనీ డైరెక్టర్ ల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. నామా నివాసంలో రూ.34 లక్షల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. రుణం సొమ్మును షెల్ కంపెనీలకు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు గుర్తించిన ఈడీ .. హైదరాబాద్, పశ్చిమ బెంగాల్ లో ఉన్న రూీ.88.85 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్న రూ.7.36 కోట్ల చరాస్తులను జప్తు చేసింది.