టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు దర్యాప్తులో వేగం పెంచిన సిట్ సంతోష్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21వ తేదీ విచారణకు హజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. విచారణకు హజరుకాకపోతే అరెస్టు చేస్తామని ప్రకటించింది సిట్. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే కోరుతూ తెలంగాణ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆదేశిస్తూ.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయవద్దంటూ సిట్ కు ఆదేశించింది. సిట్ విచారణకు సహకరించాలని సంతోష్ కు ఆదేశించింది. తదుపరి విచారణకు మంగళవారంకు వాయిదా వేసింది. సంబంధం లేని వ్యక్తులకు సిట్ నోటీసులు జారీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తొందంటూ బీజేపీ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో బీఎల్ సంతోష్ ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
BL Santhosh
ఈ కేసులో ప్రధాన నిందితులు రామనంద భారతి, నందకుమార్, సింహయాజీలను విచారించిన సిట్ అధికారులు కేరళ ఎన్డీఏ నేత తుషార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు, న్యాయవాది శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ లకు 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన విచారణకు హజరుకావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.