Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారి రేషన్, ఫించన్ నిలిపివేయడం జరుగుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ పక్క హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించకుండా ఇలా రేషన్, పింఛన్ నిలిపివేస్తామని ప్రకటించడంపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హెల్త్ డైరెక్టర్ ను సచివాలయానికి పిలిపించి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో డీహెచ్ శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.
Corona Vaccination: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే నవంబర్ 1వ తేదీ నుండి వారికి రేషన్, పెన్షన్ పంపిణీ నిలుపుదల చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.