Telangana Police: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వైరస్ కట్టడికి తెలంగాణలో లాక్డౌన్ అమలు అవుతున్న విషయం తెలిసిందే. అత్యవసర పనులకు వెళితే సహాయం చేసేందుకు ఎవరూ కనబడరు. రహదారులు నిర్మాణుష్యంగా ఉంటాయి. పోలీసులు మాత్రమే లాక్ డౌన్ పర్యవేక్షిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ గర్బిణి పట్ల వరంగల్లు సుబేదారి ఎస్ఐ రాఘవేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు.
విషయంలోకి వెళితే.. సికింద్రాబాద్ బోయినపల్లి నివాసం ఉండే వెంగళ అఖిల గర్భవతి కావడంతో తన భర్త రమేష్ కలసి హన్మకొండలోని తన తల్లి గారి ఇంటికి వచ్చింది. హన్మకొండలోని లక్ష్మీ నర్శింగ్ హోమ్ లో పరీక్షలు నిర్వహించుకుని తిరిగి కాజీపేట రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు సిద్దమయ్యింది. అయితే లాక్ డౌన్ మూలంగా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో అఖిల తన భర్త రమేష్ తో కలిసి మండు టెండలో కాలినడకన రైల్వే స్టేషన్ కు బయలుదేరింది. మార్గమధ్యలో జిల్లా పరిషత్ ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ లాక్ డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు.
గర్భవతిని అయిన తాను ఆసుపత్రి చెక్ అప్ కు వచ్చానని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గానూ రైల్వే స్టేషన్ కు వెళుతున్నామని చెప్పింది. ఆసుపత్రి రిపోర్టులను చూపింది. ఇంత ఎండలో అంత దూరం ఎలా నడుచుకుంటూ వెళతారంటూ.. తమ పోలీస్ వాహనంలో ఎక్కించుని కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద వారిని డ్రాప్ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రమేష్, అఖిల దంపతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా సందర్భాలలో పోలీసులు మానవత్వంతో విధులను నిర్వహిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. గర్బిణి పట్ల మానవత్వంతో వ్యవహరించి సాయం చేసిన ఈ ఇన్స్పెక్టర్ కు బిగ్ సెల్యూట్ చెప్పాల్సిందే కదా.