రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యలు మందు బాబులకు శాపంగా మారుతోంది. మద్యం షాపులను తగ్గిస్తూ, పేదలకు మద్యం ధరలు అందుబాటులో లేకుండా చేస్తే మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని, రాను రాను మందుబాబులు మందు మాని వేస్తారని సర్కారు ఆలోచన. అయితే ఈ ఆలోచన బెడిసి కొడుతున్నది.
కరోనా లాక్ డౌన్ అనంతరం రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని బ్రాండ్ ల మద్యం ధరలను 75 శాతం పెంచింది. దీనికి తోడు మందు బాబులకు కావాల్సిన బ్రాండ్ లు కూడా దొరకని పరిస్థితి ఉంది. పెరిగిన మద్యం ధరలతో మద్యం కొనుగోలు చేసుకోలేని పేద వర్గాలు కల్తీ మద్యం, హ్యాండ్ శానిటైజర్ లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో, నిన్న కడప, నేడు తిరుపతిలో శానిటైజర్ మరణాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో శానిటైజర్ వినియోగం పెరగడంతో ఇబ్బడి ముబ్బడిగా నకిలీ శానిటైజర్ కూడా మార్కెట్ లో తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. హ్యాండ్ శానిటైజర్ లో ఆల్కహాల్ కలిసి ఉండటంతో మందు బాబులు మత్తు కోసం తక్కువ ధరతో దొరికే శానిటైజర్ లను కొనుగోలు చేసి తాగేస్తున్నారు.
మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉండటంతో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు అక్కడి నుండి తీసుకువచ్చిన మద్యం బాటిళ్లను ఇక్కడి ప్రభుత్వ మద్యం షాపుల ధర కంటే తక్కువగా విక్రయాలు చేస్తున్నారు. దీనితో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు కూడా గతం మీద పోలిస్తే తగ్గాయి. తెలంగాణ రాష్ట్రం నుండి నిత్యం పెద్ద ఎత్తున అక్రమ మద్యం రవాణా జరుగుతోంది అనడానికి ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో పట్టుబడుతున్న కేసులే తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాష్టంలో శానిటైజర్ మరణాలు ఇకపై జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మందు బాబులకు మద్యం ధరలు అందుబాటులోకి తీసుకువస్తుందో లేదో చూడాలి మరి.