(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రాజకీయంలో పైచేయి సాధించాలనుకున్న టీడీపీ ఎంపి కేశినేని నాని ఆశలకు జగన్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది. విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించినప్పటికీ దీనిలో విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రత్యేక శ్రద్ధ కృషి ఉన్నాయి. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించినప్పటికీ అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఫ్లైఒవర్ క్రెడిట్ తాను కొట్టేయాలని ఎంపి కేశినేని నాని ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకోవడం, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వనించడం ఆ వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేయడం చేశారు. ఈ నెల 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరుగుతుందంటూ కేశినేని నాని ముందుగా ప్రకటించారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో సంతాప దినాలు కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 18 వ తేదీ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయన్ని ముందుగా కేశినేని నానే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ తరువాతనే రాష్ట్ర మంత్రి శంకర నారాయణ మీడియాకు వెళ్లడించారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడటంతో నేటి కార్యక్రమం కూడా వాయిదా పడిందని నిన్న కేశినేని నాని ట్విట్టర్ వేదిగా వెల్లడించారు. అయితే ప్రజా ప్రయోజనాల దృష్యా నేటి నుండి ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు అనుమతులు ఇస్తున్నట్లు కేశినేని ప్రకటించారు. దీంతో విజయవాడ నగర వాసులు తమ ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావించారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపి కేశినేని నాని ప్రకటిస్తే అధికార పార్టీ నాయకులు, అధికారులు దానికి అంగీకరిస్తారా అనే అనుమానాలు వచ్చాయి. అనుమానాలు నిజం చేస్తూనే అధికారులు ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు అనుమతించలేదు. ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు నేటి నుండి అనుమతించడం లేదనీ జిల్లా కలేక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వాహనాల రాకపోకలను ఎప్పటి నుండి అనుమతిస్తారనేది ఆర్ అండ్ బి అధికారులు నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు. తన హయాంలో నిర్మాణం ప్రారంభించినందున ఫ్లైఓవర్ క్రెడిట్ కోసం ఎంపి కేశినేని తాపత్రయ పడుతుండగా, తమ హయాంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినందున ఆ క్రెడిట్ తమదేనని అధికార వైసీపీ వర్గాల భావనగా ఉంది. అందుకే ఫ్లైఓవర్ పై వాహనాల అనుమతికి ఎంపి కేశినేని స్టేట్ మెంట్ ను కలెక్టర్ కొట్టిపారేశారు. అధికారులే నిర్ణయిస్తారంటూ వెల్లడించారు. చూస్తున్నారుగా రాజకీయం అంటే ఇది.