(గుంటూరు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలు మొదలు కొని కుగ్రామాలలో కూడా యువతీ, యువకులు, పెద్దలు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొందరు యువతీ యువకులు స్మార్ట్ ఫోన్లను పబ్జీ లాంటి వ్యసనానికి బానిసలుగా మారే గేమ్స్ ఆడుతూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. మరో పక్క సెల్ఫీ సరదాలను తీర్చుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న సంఘటనలు చూస్తున్నాము. అయితే కొందరు ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి దాన్ని మిత్రులు, బందువులకు పంపుతున్నారు.
గుంటూరు జిల్లాలో పది రోజుల వ్యవధిలో రెండు సెల్ఫీ ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. అయితే ఇక్కడ ఇద్దరూ భార్యల మూలంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక యువకుడు భార్యపై అనుమానంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గోపి భార్య గ్రామ వాలంటీర్గా పని చేస్తున్నది. ఆమె ప్రవర్తనతో మనస్థాపానికి గురైన గోపి ఈ నెల మొదటి వారంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగు మందు తాగే సమయంలో సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఇదే జిల్లా కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామానికి చెందిన అశోక్ భార్య ఇటీవల మృతి చెందింది. భార్య మృతి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సమాధిపై క్రికెట్ బ్యాట్, రెండు బాల్స్ పెట్టాలంటూ చివరి కోరికను సెల్ఫీ వీడియోలో తెలియజేశాడు అశోక్.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ రెండు మరణాలు భార్యల మూలంగానే జరిగాయి. అయితే ఒకరు భార్యపై అనుమానంతో ఆత్మహత్య చేసుకోగా ఒకరు భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, మిత్రులకు షేర్ చేయడం ఇప్పుడు ఎక్కువ అయ్యింది. మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్ సమీపం వద్ద హైదరాబాద్ నుండి వచ్చిన చెవిటి, మూగ ప్రేమ జంట కూడా తమ సైగల ద్వారా చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిన తరువాత వారు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం ప్రజలకు తెలిసిందే.