ఇటీవల కాలంలో కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే వినియోగదారులకు షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. మధ్య తరగతి వర్గాల నుండి ప్రముఖుల వరకు అందరూ కరెంట్ బిల్లు బాదుడుకు గురికాక తప్పలేదు. అసలే కరోనా కష్ట కాలం..ఈ తరుణంలో వేలు, లక్షల రూపాయల మేర విద్యుత్ బిల్లులు వస్తుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ సమస్య సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కనిపిస్తున్నా సామాన్యుడి గోడు మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇటీవల సెలబ్రిటీల గొంతు గట్టిగా వినిపిస్తుంది.
విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ బాలీవుడ్ తారలు తమ తీవ్ర అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతకు ముందు తాప్సీ పన్నూ, హుమా ఖురేషి, సోహా అలీ ఖాన్, వీర్ దాస్, పుల్కిత్ సామ్రాట్, రేణుకా షాహనే, డినో మోరియా వంటి తారలు లాక్డౌన్ సమయంలో తమ పెరిగిన విద్యుత్ బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ కూడా చేరారు. ఆయనకు వచ్చిన విద్యుత్ బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రూ.లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తన సమస్యను అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఈఎమ్ఎల్) సంప్రదించిన తరువాత పరిష్కరించినట్లు అర్షద్ వార్సీ వెల్లడించారు.
లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లును పంపడంపై అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఇఎంఎల్) పై అర్షద్ వార్సీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పెరిగిన విద్యుత్ బిల్లును చూసిన తరువాత, తన విద్యుత్ బిల్లును చెల్లించడానికి తన పెయింటింగ్స్ మరియు తరువాత కిడ్నీలను అమ్మవలసి వస్తుందేమో అని అన్నారు.