దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ వేళల్లో.. కేసులు పరిమితంగా నమోదు కాగా కేంద్రం భారీగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏకంగా పది వేల పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయి.
కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం కోసం చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. కరోనా సోకిన రోగులు ఆరోగ్యవంతంగా ఇంటికి చేరడానికి ఒక్కో వ్యక్తిపై కనీసం రూ.3.5 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆసుపత్రిలో చేరడానికి ముందు నిర్వహించే పరీక్షల నుండి ప్రతిదీ కూడ ఇప్పుడు ప్రభుత్వమే భరిస్తోంది. అయితే కేసుల నమోదు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయటం రానున్న రోజుల్లో మరింత కష్టతరం కానుంది. ఇప్పుడే మహారాష్ట్రలో పేషంట్స్ కు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు సరిపోని పరిస్థితి ఉంది. కేసులు అనూహ్యంగా పెరిగితే రానున్న రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ పరిస్థితుల్లో.. కరోనా పాజిటివ్ రోగులకు ఎంత వాసులు చేయాలి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులతో కూడిన ఫిక్కీ కోవిడ్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్సు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేసేందుకు ఎంత వాసులు చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. ఏ చికిత్సకు ఎంత అన్నది నిర్ణయించింది. అయితే దీనిలో కొన్ని షరతులు విధించారు. ప్రభుత్వం సిఫారసు చేసిన పేషెంట్లకు ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రూ.13, 600 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.27,088, వెంటిలేటర్ తో సహా ఐసీయూ చికిత్సకు రూ.36.853 ఛార్జ్ చేయాలని నిర్ణయించారు. అదే సొంతంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే వారికి కాస్త ఎక్కువ గానే రుసుము వాసులు చేయాలని నిర్ణయించుకున్నారు.
సొంతంగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సకు రూ.17వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చికిత్సకు రూ.34వేలు, వెంటిలేటర్ తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.45వేలు రుసుముగా నిర్ణయించారు.
ఇక.. ఇన్య్సురెన్సులో భాగంగా చికిత్స చేసే వారికైతే మరో లెక్కన వసూలుకు నిర్ణయించారు. ఇన్సూరెన్సు కల్గిన పేషంట్స్ కు ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రూ.20వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.55 వేలు, వెంటిలేటర్ తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.68 వేలుగా ఫిక్స్ చేశారు. ఈ ధరల లెక్కతో చెల్లింపులు చేయడం బీమా కంపెనీలకు రానున్న రోజుల్లో పెనుభారంగా మారడం ఖాయంగా కనబడుతున్నది.