వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోర్త్ పిల్లర్ స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పొందారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు పార్టీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఉన్న ప్రకాశం, కర్నూలు జిల్లా బాధ్యతలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అప్పగించారు.
2013 లో వైకాపాలో చేరిన వేమిరెడ్డి తన అర్ధ బలం, అంగబలంతో నెల్లూరు జిల్లా రాజకీయాలలో క్రియాశీల భూమికను పోషించడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. గడచిన ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పూర్తి భాద్యతలు నిర్వహించడంతో పాటు ప్రకాశం, కర్నూల్, కృష్ణా జిల్లాలతో పాటు అంతర్గతంగా తనకు సున్నితంగా ఉన్న నాయకుల విజయానికి తోడ్పాటు అందించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి కమిట్మెంట్ గుర్తించిన పార్టీ అధినేత కోర్ నేతల సరసన జిల్లాల బాధ్యతలను అప్పగించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు ఈ నెల ఒకటవ తేదీనే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కీలక నేతలకు జిల్లాల బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ కేంద్ర కార్యాలయం భాద్యతలు కూడా ఉన్న నేపథ్యంలో అయన చూస్తున్న జిల్లాల్లో ప్రకాశం, కర్నూల్ జిల్లాల బాధ్యతలను వేమిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.