ప్రభుత్వంపై ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వ్యాఖ్యానాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణ చర్యల వేటు ఖాయం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ క్రమశిక్షణా వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటారా?. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అదే దారిలోకి వస్తున్నట్లు కనబడుతోంది. ఆ అధికారి ఎవరో కాదు. నాలుగు రోజుల క్రితం వరకు ఏపి సీఎంఓ కార్యాలయంలో కీలక శాఖల బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ పివి రమేష్.
పివి రమేష్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ట్వీట్ చేసిన ఆ అంశం ఏమిటంటే.. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదని ఇప్పుడు అది ఐసీఎస్ (కస్టమర్ సర్వీస్) మారిపోయింది 1984 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కేబీఎస్ సిద్దూ వ్యాఖ్యానించారు. కస్టమర్ అంటే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారిని సంతృప్తి పరచడమే ఐఏఎస్ ల విధి అన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రచురితమైన వ్యాసాన్ని పివి రమేష్ రీట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
రిటైర్ అయిన అనంతరం ఏపీ సీఎంఓలో ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పీవీ రమేష్ కొనసాగుతున్నారు. ఇటీవల అయన వద్ద ఉన్న శాఖలను ప్రభుత్వం తప్పించింది. ఈ పరిణామంతో అయన మనస్తాపానికి గురి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయన తన చాంబర్కు కూడా వెళ్లడంలేదు. కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ సందర్భంలో ఆయన చేసిన ట్వీట్ సంచలనం కల్గించింది. దీనిపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.