రాజకీయాల్లో కొంత మంది నాయకులు సుదీర్ఘకాలం నిలబడిపోతారు. వాళ్ళ ఉనికి, వాళ్ళ ముద్ర దశాబ్దాల తరబడి ఉండేలా చూసుకుంటారు. దేశంలో అటువంటి అరుదైన నాయకులలో మాజీ సీఎం చంద్రబాబు కూడా ఒకరు. పరాయి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి పార్టీ అధ్యక్షుడుగా ఎదిగి, సీఎం కుర్చీ ఎక్కి ఎన్నో యుక్తులు, కుయుక్తులు, పన్నాగాలతో జాతీయ స్థాయికి ఎదిగారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపు ఓటములు చూసిన చంద్రబాబు.. కొద్ది కాలంగా ఒక రకమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్తున్నారు. గతంలో ఏ ప్రత్యర్థి ఇవ్వని షాకుపలు, ఝలక్కులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. అయితే జగన్ నుంచి తనకు ఎటువంటి షాకులు, ఝలక్కులు ఎదురవుతున్నాయో వాటికి మించి జగన్ ను కూడా చంద్రబాబు ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. తన చతురత, చాణిక్యత, యుక్తి, కుయుక్తి, పన్నాగం, కుట్ర ఏ పేరు పెట్టుకున్నా సరే చంద్రబాబును దటీజ్ చంద్రబాబు అని ఎందుకు అయన వర్గం చెప్పుకుంటుందో కొన్ని ఉదాహరణలుగా చూపిస్తున్నారు.
తమిళ రాజకీయ వాసన మనకూ వస్తుందా..?
జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదట తీసుకున్న నిర్ణయం టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష చేయాలని. ఇప్పటికీ పదిహేను నెలలు కావస్తోంది. అది జరగలేదు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో నీటి ప్రాజెక్టుల అవినీతిని ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం బయటకు తీయలేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఇలా దాదాపు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ వైసిపి ఎన్నో ఆరోపణలు చేసి కరపత్రాలను విడుదల చేసి పంచిపెట్టింది. వాటిలో దేనిని కూడా ఇంత వరకు నిరూపించలేదు. అవి నిరూపితమై లోకేష్ ను, చంద్రబాబు ను జైలులో పెట్టాలని తాను అనుభవించిన జైలు జీవితాన్ని వారు కూడా అనుభవించేలా చేయాలని ఎదో ఒక మూల జగన్మోహన్ రెడ్డి అనుకోవడం సాధారణమే. తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కరుణానిధిని జైలులో పెట్టేవారు. తరువాత కరుణానిధి సిఎం అయిన తర్వాత జయలలిత పై కేసులు బనాయించి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు అటుంటి రాజకీయాలు లేనప్పటికీ ఇప్పుడు మాత్రం ఇలాగే మొదలు అవుతుంది. ఒకరిపై మరొకరు కక్ష తీర్చుకొని ప్రజలకు కావలసిన సంక్షేమాన్ని అందించేసి రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో కక్ష పెంచుకునే తమిళ రాజకీయం తెలుగునాట అడుగుపెట్టింది. ప్రస్తుతానికి అది పీక్స్ లో ఉంది. యువకుడిగా ఉంటూ ప్రజల్లో అత్యధిక మన్ననలు ఉన్న సీఎం జగన్ వంటి నాయకుడిని ఎదుర్కోవడం 70 ఏళ్లు దాటిన చంద్రబాబుకి ఒక రకంగా కష్టమే. కానీ తనకు ఉన్న చతురత, తెలివితేటలు మేనేజ్మెంట్ బలాలతో నెట్టుకొస్తూ దటీజ్ చంద్రబాబుగా అనిపించుకుంటున్నారు.
కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం..చంద్రబాబుకి.. జగన్ కి
విద్యుత్ పీపీఏల సమీక్ష చంద్రబాబు అనుకున్నదే జరిగింది. జగన్ మాట నెగ్గలేదు. ఆంగ్ల మాధ్యమం విషయంలోనూ చంద్రబాబు అనుకున్నదే జరిగింది. జగన్ మాట నెగ్గలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలుకొని రమేష్ కుమార్ వ్యవహారంలో, ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న రాజధాని వికేంద్రీకరణ విషయంలో కూడా కోర్టు తీర్పుల ద్వారా జగన్ కు వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు అనుకున్నది ప్రత్యక్షం గానో పరోక్షంగా నెరవేరుతుంది. ఇవన్నీ కోర్టు లతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్ లుగా ఉండగా, ఇప్పుడు జగన్ ను ఇరుకున పెట్టడానికి, జగన్ ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకోవడానికి చంద్రబాబు తన దగ్గర ఉన్న పటిష్ఠమైన అస్త్రాన్ని బయటకు తీశారు. ఈ అస్త్రం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసెయ్యాలి అనే ఒక పెద్ద ప్రణాళిక కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో ఒ మీడియా తయారు చేసింది. ఇది ఎంత వరకు వెళ్తుందో, చంద్రబాబు లక్ష్యం, ఆ మీడియా సంస్థ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది పక్కన పెడితే అంశం మాత్రం జాతీయ స్థాయిలోనూ సంచలనం కలిగిస్తోంది. న్యాయమూర్తుల ఫోన్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తమ ప్రతిపక్ష నాయకులు, మీడియా జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్ లు ట్యాప్ చేస్తుంది ఇది న్యాయ వ్యవస్థ పై నిఘా అనేది ప్రస్తుతం టిడిపి వైసిపి ప్రభుత్వం పై చేస్తున్న అతి పెద్ద ఆరోపణ. దీనిపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వానికి నైతికంగా కొన్ని ఇబ్బందులు కచ్చితంగా వస్తున్నాయి. అందుకే జగన్ ను ఇబ్బంది పెట్టడంలో ఒక రకమైన ఒత్తిడికి గురిచేయడం లో చంద్రబాబు ఒక రకంగా సఫలీకృతులు అయినట్లే చెప్పవచ్చు. ఒ వైపు తన పార్టీ బలహీనపడుతున్నా, తన ఎమ్మెల్యే లు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నా చంద్రబాబు తన యుక్తి, కుయుక్తులతో జగన్ ను మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. అందుకే రాజకీయాల్లో దటీజ్ చంద్రబాబు అంటారు.