కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే ,ఈ ఆత్మహత్య విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించిన తీరుపై రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా స్పందిస్తున్నాయి. షేక్ అబ్దుల్ సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదా ఖలందర్, కూతురు సల్మా మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించారు.
వేగంగా స్పందించిన సీఎం జగన్
ఈ ఆత్మహత్య సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే, వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి, బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా డీజీపీ, ఇంటలిజెన్సు చీఫ్లతో మాట్లాడిన సీఎం, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్లు, బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ను నియమించారు. వారు వెంటనే నంద్యాలకు వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఇంకా హోం మంత్రి, డీజీపీ నుంచి ఆయన నివేదిక కోరారు.
24 గంటల్లోనే చర్యలు
షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత శిక్ష్మాస్మృతి (ఐపీసీ) సెక్షన్–34లోని సెక్షన్–323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), సెక్షన్–324 (మారణాయుధాలు చూపి లేదా ఆ తరహాలో బెదిరించడం), సెక్షన్–306 (ఆత్మహత్యకు పురికొల్పడం) కింద సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్పై కేసులు నమోదు చేశారు.
మైనారిటీల హర్షం
షేక్ అబ్దుల్ సలామ్ సెల్ఫీ బయటకు వచ్చిన వెంటనే శర వేగంగా స్పందించిన సీఎం వైయస్ జగన్, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడం, ఇద్దరు ఐపీఎస్ అధికారులను సమగ్ర దర్యాప్తు కోసం నియమించడం, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులను గర్తించి, సీఐ, హెడ్ కానిస్టేబుల్ను అరెస్టు చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు హర్షం వక్తం చేశాయి. ప్రభుత్వ చర్యలను మైనారిటీలు స్వాగతించారు. తద్వారా కలహాలకు చాన్స్ లేకుండా చేశారని అంటున్నారు.