‘లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాం..’ ఇది దుబ్బాక ఉప ఎన్నికల ముందు మంత్రి హరీశ్ ధీటైన వ్యాఖ్యలు. ‘గెలిస్తే పొంగిపోం.. ఓడితే కుంగిపోం’ అదే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. మొదటి వ్యాఖ్య.. రాష్ట్రంలో తమ ఏకచత్రాధిపత్యానికి నిదర్శనమైతే.. రెండో వ్యాఖ్య ప్రజా వ్యతిరేకత పుట్టించిన భయం. ఎంపీగా కవిత ఓడినా అది టీఆర్ఎస్ ఓటమి కాదు.. బీజేపీ గెలుపూ కాదు. ఆ ఓటమి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లాస్.. పార్టీకి కాదు. కానీ.. దుబ్బాక దెబ్బ ఏకంగా పార్టీనే కుదిపేసింది. ఏకంగా.. అమ్మో..! జాగ్రత్త పడాలి.. అనేంతగా. ఇప్పుడదే చేస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇందుకు అనుకూలంగా మార్చుకుంటోంది. మంత్రి కేసీఆర్ ప్రకటించిన వరాలు అలానే అనిపిస్తున్నాయి.
హైదరాబాద్ ప్రజలకు వరాలు..
మహానగర ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు మంత్రి కేటీఆర్ వరాలు ప్రకటించారు.. ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ, జీహెచ్ఎంసీ కార్మికులకు 3వేలు చొప్పున వేతనాల పెంపు, వరద సాయం కొనసాగింపు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21కి ఆస్తిపన్నులో 15వేలు కట్టిన వారికి 50 శాతం రాయితీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 10వేలలోపు ఆస్తి పన్ను కట్టిన వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న 14500 వేతనాన్ని 17500 కు పెంచారు. వరద సాయం అందని వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మొత్తంగా వందల కోట్ల అదనపు భారానికి సిద్దమయ్యారు. అయితే ఉన్నట్టుండి ఈ ప్రకటనలేంటి మహాశయా అంటే.. ఇవి ఎన్నికల తాయిలాలు ఓటరయ్యా అనిపించక అనిపించదు.
టీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలు ఇవే..
వరదలే వచ్చినా.. సమస్యలే చుట్టుముట్టినా.. తమ ఆధిపత్యానికి తిరుగుండదనే ఇన్నాళ్లూ భావించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ.. దుబ్బాక దెబ్బ మామూలుగా తగల్లేదు. టీఆర్ఎస్ ఆలోచనలను నేలకు దించిన ఫలితమది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిపించారు కేటీఆర్. ఇప్పుడా మ్యాజిక్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కవిత ఓటమి, ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, హైదరాబాద్ లో వరదలు సమాధానం లేకుండా చేశాయి. గెలుపు తప్ప ఓటమి ఎరుగని టీఆర్ఎస్ ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి.. గ్రేటర్ పై ఆధిపత్యం నిలబెట్టుకోవడం, రెండు.. బీజేపీకి మళ్లీ అవకాశం దక్కకుండా చేయడం.