ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉండదు అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..తెలంగాణలో పట్టు నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మేమే అని తెలంగాణ ప్రజలలో పార్టీ పట్ల విశ్వసనీయత ఎవరు క్రియేట్ చేసుకోలేక పోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికలలో జరిగిన మొదటి సారి ఎన్నికలలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తరువాత పట్టు కోల్పోతూ వచ్చింది.
ముఖ్యంగా 2018 ముందస్తు ఎన్నికలలో గతం కంటే దారుణంగా తక్కువ స్థానాలలో పడిపోవటం తర్వాత పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్దీ తగ్గిపోతుండటం మాత్రమే కాక ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం గల్లంతైనట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇటువంటి గడ్డు కాలం ఎదుర్కొంటున్న పరిస్థితిలో టీ.కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం పార్టీ కి భారీ డ్యామేజ్ అని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ టీ కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడి కోసం రంగంలోకి దిగింది.
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ హైదరాబాద్ కి వస్తున్నారు. గాంధీభవన్ లో జరగబోయే కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కొత్త పిసిసి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం మూడు రోజులు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ హైదరాబాదులో ఉండబోతున్నారు. మొదటి రోజు కోర్ కమిటీ సమావేశం, రెండో రోజు మాజీ రాష్ట్ర మంత్రులతో సమావేశం, నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుని ఏఐసిసి కి ఒక నివేదిక రూపంలో అందించనున్నారు.
ఇదిలా ఉండగా పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేరు బలంగా వినబడుతుంది. కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వటం కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీ బాగుపడుతుందని సీనియర్లు తెలుపుతున్నారట. మరి కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఠాగూర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.