ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పులివెందులలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటనలో బాగంగా కడప జిల్లా పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బస్టాండ్, డిపో, రెసిడెన్సియల్ పాఠశాల, బీటీ రోడ్లు మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా అప్పాచీ లేదర్ ఫ్యాక్టరీకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ఆర్ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అయిదు సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గండికోట రిజర్వాయిర్ పై కొత్త ఎత్తిపోతల పథకం పనులను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామన్నారు. గండికోట రిజర్వాయర్ లో 26 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని ఎప్పుడూ నింపలేదనీ, రూ.665 కోట్లతో పునరావాసం చెల్లించి 26.85 టీఎంసీల నీటిని నింపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గండికోట, చిత్రావతి నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి త్యాగాల వల్లనే లక్షలాది రైతులకు మేలు జరుగుతోందన్నారు. నిర్వసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఏపిఐఐసీ చైర్మన్ ఆర్ కె రోజా, అపాచీ లెదర్ ఇండ్రస్టీస్ గ్రూపు వైస్ ప్రెసిడెంట్ గవిన్ చాంగ్, తదితరులు పాల్గొన్నారు.