విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద మరో సారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజెపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాథవ్, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలను నెల్లిమర్ల వద్ద పోలీసులు నిలువరించారు. రామతీర్థం కొండపైకి అయిదుగురిని మత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, అందరినీ అనుమతించాలని బీజెపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ బీజెపీ నేతలు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, బీజెపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగ మారింది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజెపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్సీ మాధవ్ తో సహా పలువురు బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
రామతీర్థం వద్ద, విజయనగరం డివిజన్ లో ఈ నెలాఖరు వరకూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రామతీర్థం కూడలి నుండి దేవస్థానం వరకు, బోడికొండపై కొదండ రాముడి ఆలయం వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. సీతారామనిపేట కూడలి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బోడికొండ మెట్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కొండపైకి ఆందోళనకారులు వెళ్లకుండా బారికేడ్లను సిద్దంగా ఉంచారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నానన్నారు. ఏపిలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ ద్వంద వైఖరిపై ప్రజా పోరాటం చేస్తామని సోము వీర్రాజు అన్నారు. వైసీపీ, టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం బీజెపి నేతలను ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. రామతీర్థం ఆలయంలోకి తమను అనుమతించే వరకూ వదిలిపెట్టమని విష్ణువర్థన రెడ్డి అన్నారు. ఇక్కడి పరిణామాలపై బీజెపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు స్పందించారు. వైసీపీ, టీడీపీ నేతలకు అనుమతి ఇచ్చి బిజెపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఏపిలో బీజెపీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఏపి ప్రభుత్వం, పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.