హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ , మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వల్ల వందల సంఖ్యలో పక్షులు చనిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వాలు వేల సంఖ్యలో కోళ్లను, బాతులను కల్లింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ తెలుగు రాష్ట్రల్లోకి కూడా ప్రవేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో గుడ్లు మరియు మాంసం తినడం పై అనేక సందేహాలు వస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బర్డ్ ఫ్లూ పై నెలకొన్న అనేక అనుమానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా పక్షులు ఏవైతే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ బారిన పడినాయో వాటికి దగ్గరగా ఉండడం, వాటిని ఆహారంగా తీసుకునేడప్పుడు సరిగా ఆ మాంసాన్ని ఉండికించకుండా తినడం వల్ల మనుషులకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా హాఫ్ బాయిల్డ్ మాంసాహారానికి దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదని, కాబట్టి ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉడికించి తింటే ఏ ప్రమాదం ఉండదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ప్రస్తుతం బర్డ్ఫ్లూ వైరస్ ప్రభావం అమెరికా, ఆసియా, దేశాల్లో కంటే యూరప్ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని వారాలుగా యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, పోలండ్, క్రొయేషియా, ఉక్రెయిన్లలో బర్డ్ఫ్లూ వైరస్ ను కనుగొన్నట్లు యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్(ఈసీడీసీ) తెలిపింది. ఫ్రాన్స్లో సుమారు 6 లక్షలకు పైగా కోళ్లను ఈ వైరస్ కారణంగా వధించారు. జర్మనీలో అధికారులు 62వేల టర్కీ కోళ్లు, బాతులను అక్కడి కల్లింగ్ చేశారు. మనదేశంలోకి ప్రవేశించిన బర్డ్ ఫ్లూ జర్మనీనుంచి వచ్చినదేనని అనుమానాలు ఉన్నాయి కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలూ లేవు.