రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు, మాటకు మాట, కౌంటర్ అటాక్స్.. సర్వ సాధారణం. ఇవేమీ లేకుండా నేటి రాజకీయం అసలు ఉండనే ఉండదు. అయితే.. ఇది రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయానికి సంబంధంలేని ఓ వ్యక్తి, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసారు. దీంతో సదరు పార్టీ నుంచి నాయకుల అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కౌంటర్లు ఎదుర్కోవాల్సి వచ్చింది రాజకీయాలతో సంబంధం లేని ఆ వ్యక్తి. ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది అంటే ఉంది.. ఉంటుంది.. లేదు అంటే లేదు. వారిద్దరే విజయనగరం జమిందారీ వారసులు అశోక్ గజపతిరాజు, సంచయిత గజపతి రాజు. వీరిద్దరి మధ్య వాదోపవాదాలు, వాగ్యుద్దం ఏడాదిన్నరగా జరుగుతోంది. అయితే.. ఇది రాజకీయ రంగు పులుముకుంది మాత్రం జనవరి 18న. ఇందుకు కారణం.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి.
ఎవరేమన్నారు..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అశోక్ గజపతిరాజు.. ‘తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి సంచయిత గజపతిరాజు.. ‘పార్టీ పెట్టుకుని సొంత కాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో @ncbn గారితో పాటు @Ashok_Gajapathi గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది’ అంటూ అప్పట్లో రాసిన లేఖగా చెబుతున్న ఫొటోను జత చేశారు. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంట గలిపిన @Ashok_Gajapathi గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడటం, ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’ కౌంటర్ ఇచ్చారు.
ఒక్కసారిగా సంచయితపై టీడీపీ అటాక్..
సంచయిత ట్వీట్ తో నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ అభిమానులు, అశోక్ గజపతి అభిమానులు ఇన్నాళ్లూ సంచయితపై దాచుకున్న కోపాన్ని, ఆవేశాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కారు. ట్విట్టర్ వేదికగా తమ మాటలకు అక్షర రూపమిచ్చి విరుచుకుపడ్డారు. ‘నీకేం తెలుసని మాట్లాడుతున్నావు.. ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు’, ‘తండ్రి పేరు చెప్పుకోలేని నువ్వు కూడా విమర్శించేదానివి అయిపోయావా’, ‘జగన్ వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే నువ్వు అశోక్ గజపతిరాజును, చంద్రబాబును అనే స్థాయికి ఎదిగిపోయావా’, ‘గట్టిగా మాట్లాడదామంటే మహిళవై పోయావు.. ఏమన్నా అంటే మహిళా సంఘాలు, హక్కులు అంటారు. తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది’, ‘క్రిస్టియన్ వి అయ్యుండి ఆస్తుల కోసం పాకులాడుతున్నావ్.. నువ్వా టీడీపీని, చంద్రబాబును విమర్శించేది’, ‘మరొకసారి టీడీపీని, చంద్రబాబును విమర్శించొద్దు.. నీది ఆస్థాయి కాదు’.. అంటూ ఎన్నో ట్వీట్లు సంచయితకు ఎదురయ్యాయి. నిజానికి ఈ ట్వీట్ల బాణాల్ని సంచయిత ఊహించి ఉండకపోవచ్చు. ఇన్నాళ్లూ అశోక్ గజపతిపై చేసిన కౌంటర్లకు ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఈసారి ఆమె ఏకంగా రాజకీయంగా అటాక్ అయ్యారు.
సంచయిత రెస్పాన్స్ ఏంటో..
దీంతో పార్టీ అభిమానులు, ఆయన అభిమానులు కూడా అశోక్ గజపతి రాజుకు మద్దతుగా నిలిచినట్టైంది. ఒక మాట అని నాలుగు మాటలు అనిపించుకున్నట్టైంది. పైగా.. సంచయితను పర్సనల్ గా ఎటాక్ చేశారు. ఈ పరిణామాలు సంచయిత ఊహించనివి అని చెప్పాలి. సంచయితపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చినా రెస్పాండ్ కాని తెలుగు తమ్ముళ్లు.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున మాత్రం తమ ప్రతాపం చూపించారు. మరి సంచయిత ఈ రాజకీయ వేడిని తట్టుకుంటారో.. తాను కూడా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.