YS Jagan ; Andhra Pradesh State లో ఒక కొత్త కాక రగిలింది. రాజకీయమో, రంగులమయామో కాకుండా ప్రభుత్వ భక్తులే.. CM YS Jagan సైనికులే.. సంక్షేమ వారధులే.. ఆందోళన బాట పట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్లుగా పిలవబడుతున్న గ్రామ సేవకులు ధర్నాలు, ఆందోళన బాట పట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షం, టీడీపీ మాటలు పక్కన పెడితే అధికార పక్షంలోనే వాలంటీర్ల ఆందోళనలపై ఆసక్తికరమైన వాదనలు వస్తున్నాయి. అసలు వీళ్ళ గొడవ ఏంటి..? భిన్న వాదనలు ఏంటి..? పరిష్కారం ఏంటి..? అనేది కొంచెం లోతుగా చెప్పుకుందాం..!!
YS Jagan ; రెండున్నర లక్షల మంది బతుకులు..!!
రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండున్నర లక్షల మంది గ్రామ/ వార్డు వాలంటీర్లు ఉన్నారు. నెల నెల వారికి ప్రభుత్వం రూ. 125 కోట్లు గౌరవ వేతనాలుగా ఇస్తుంది. వారికి పని వేళలు అంటూ ప్రత్యేకంగా ఏమి లేవు. రోజులో ఆరు, ఏడూ గంటల పాటూ.., నెలకు సుమారుగా 20 రోజులు పని ఉంటుంది. వాలంటీర్ల ఎంపిక పూర్తిగా రాజకీయంగానే జరిగింది. నియోజకవర్గ స్థాయిలో నాయకులే తమ అనుయాయుల ద్వారా సిఫార్సులు చేసి, ఎంపికలు చేసుకున్నారు. వీరేమి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు కాదు. ఎంపికల సమయంలోనే వీరికి కొన్ని కండీషన్లు చెప్పి ఎంపిక చేసారు, శిక్షణ ఇచ్చారు. ప్రతి పథకానికి అర్హులను గుర్తించడం, లబ్దిదారులను ఎంపిక చేయడం, ఇంటింటికీ తిరిగి అవసరమైన ప్రభుత్వ పరమైన సమాచారం చేరవేయడం వీళ్ళ పని. పని బాగానే ఉంది. నెలలో వారం రోజులు తీవ్రంగా శ్రమ అనిపిస్తున్నా.., మిగిలిన రోజులు కాస్త రిలీఫ్ గానే పని చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పథకం ఆరంభం అయితే వీళ్లకు పని పడుతుంది. ఇది మొత్తం బాగానే ఉంది. జీతం విషయంలోనే గొడవంతా జరుగుతుంది.
పెంచుతారని మొదటి నుండీ పుకార్లు..!
వాలంటీర్ల నియామకాలు 2019 ఆగష్టులోనే జరిగాయి. రెండు నెలలు పని అలవాటైన తర్వాత.. ఇక జనవరి 2020 నాటికి జీతాలు వీళ్లకు పెంచేస్తారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. వాలంటీర్ల పనితీరుపై సీఎం జగన్ సంతృప్తిగా ఉన్నారని.., నెలకు రూ. 8 వేలు చేయనున్నారని పుకార్లు మొదలయ్యాయి. చాలా వరకు ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ జరగలేదు. మొత్తానికి పనికి తగిన వేతనం మాత్రం వీళ్ళకి అందడం లేదు అనేది ఈ వర్గాల వాదన. కనీసం నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. అందుకే చూసి, చూసి ఆందోళన బాట పట్టారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ డ్రైవర్ల ఆందోళనకు ప్రభుత్వం రెండు రోజుల్లోనే దిగొచ్చింది. రూ. 16 వేల నుండి రూ. 21 వేలకు పెంచింది. సో.. తమకు పెంచుతుంది అని వాలంటీర్లు భావించారు. కానీ…
Must Read ; షర్మిల పార్టీ – కీలక అడుగులు..! వైసీపీలో కొత్త గుబులు..!!
* “వాలంటరీ అంటే స్వచ్చంధ సేవ. సో.. వాళ్లకి ఇచ్చేది గౌరవ వేతనం. అంచేత జీతం పెంచాలి అని డిమాండ్ చేసే హక్కు లేదు. ఇష్టం లేకపోతే మానేసి వెళ్లిపోవచ్చు” అంటూ వైసిపీలోనే కొందరు గట్టిగా వాదన వినిపిస్తున్నారు.
* “వాలంటీర్లు చేస్తున్న సేవలు బాగున్నాయి. క్షేత్రస్థాయిలో వాళ్ళు లేకపోతే పథకాలు నడవవు. వాళ్లకు అడిగిన జీతం ఇవ్వడంలో తప్పు లేదు” అంటూ వైసిపీలోనే కొన్ని వర్గాలు చెప్తున్నాయి.
* ప్రభుత్వం వాలంటీర్లపై ఆధారపడి ఉంది అనేది వాస్తవం. ప్రతీ 50 ఇళ్లకు ఒకరి నియామకం ద్వారా ఆ ఇళ్లకు పథకాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక సులువైంది అనేది వాస్తవం. సీఎం జగన్ అనుకున్నట్టు ఫలితాలు రావడం కూడా వాస్తవమే. కాకపోతే జీతమే మొత్తం సమస్య తెచ్చి పెడుతుంది. ఈరోజుల్లో రూ. 5 వేలకు ఉద్యోగం అంటే చిన్న చూపుగానే ఉంటుంది. అందుకే కొందరు అక్కడక్కడా చేయి చాపుతున్నారు. అన్ని చోట్ల వాలంటీర్లు స్వచ్ఛంగా, కడిగిన ముత్యాల్లా లేరు. సగానికి పైగా వాలంటీర్లు అదనపు ఆదాయం కోసం లబ్ధిదారుల దగ్గర చేయి చాపుతున్నారు. కొన్ని ఘటనలు బయటకు వస్తున్నాయి. కొన్ని ఘటనలు లోలోపల మగ్గుతున్నాయి.
సంఖ్య తగ్గించి… వేతనం పెంచితే..!?
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 21 నెలల్లో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఆ లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగిపోయింది. కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు కంటే.. ఉన్న పథకాలను సక్రమంగా ఏటా క్రమం తప్పకుండా అమలు చేస్తే చాలు అనే భావన నాటుకుంది. ఉన్న పథకాలు అమలు కావాలంటే.. ఇప్పటికే లబ్ధిదారుల డేటా మొత్తం సెర్వర్లలో..,ఆయా పథకాల డేటాబేస్ లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి… ఈ దశలో వాలంటీర్లకు కొంత పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అందుకే 50 ఇళ్లకు ఒకర్ని కాకుండా 150 లేదా 200 ఇళ్లకు ఒకర్ని నియమించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్నా రెండున్నర లక్షల మంది వాలంటీర్ల సంఖ్యని లక్షకి కుదించి.. వాళ్లకు నెలకు రూ. 12 వేల వరకు వేతనం ఇస్తే బాగుంటుంది అనే కొత్త ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. వాలంటీర్ల సమస్యకి ఇదే పరిష్కారం అనే వాదనలు ఉన్నాయి.