Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోమారు ఢిల్లీ బాట పట్టారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం కావడంతో దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టారు. అయితే, జనసేనాని ఢిల్లీ టూర్ పై కొత్త చర్చ జరుగుతోంది.
ఢిల్లీ చేరుకున్న Pawan Kalyan పవన్ కళ్యాణ్…
పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి చేరుకున్నారు. తన పర్యటనలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్ర పెద్దలను కలవనున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిణామాలపైనే ఈ సారి పవన్ కల్యాణ్ ప్రధానంగా చర్చిస్తారని అంటున్నారు. అయితే, పవన్ టూర్ పై కొత్త చర్చలు మొదలయ్యాయి.
జనసేనానికి అపాయింట్ కష్టాలు ఎదురు కావు కదా?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఢిల్లీ వెళ్లిన సమయంలో బీజేపీ పెద్దల దగ్గర అపాయింట్ మెంట్ సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో నిరీక్షించి అనంతరం ఎవరినీ కలవకుండానే తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఇప్పుడు కీలక విషయంలో ఆయనకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ ఏం చెబుతారు ? పవన్ మాటలకు బీజేపీ పెద్దలు ఏ మేరకు విలువ ఇస్తారు? స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వైఖరితో పాటు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా మారిపోనుందా? అనే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది.