YS Jagan : 2019లో ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ 2020 లో బాగానే కష్టకాలం అనుభవించాడు. ఒకపక్క అసెంబ్లీ లో పాస్ అయిన బిల్లులు మండల దాటి వెళ్లట్లేదు… మరొకపక్క హైకోర్టులో ఎదురుదెబ్బలు వీటన్నిటి మధ్య నిమ్మగడ్డతో పోరు. ఇలా గడ్డు కాలం గడిపిన ఏపీ ముఖ్యమంత్రి కి త్వరలోనే మంచి రోజులు రానున్నాయి అని తెలుస్తోంది…
మండలిలో హవా….
వివరాల్లోకి వెళితే…. ఇకనుండి అసెంబ్లీలో పాసయిన ఏ చట్టం కూడా ఈ సంవత్సరం జూన్ నెల తర్వాత శాసనమండలిలో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మండలిలో మెజారిటీ అనుభవిస్తున్న టీడీపీ జూన్ తర్వాత మైనారిటీలో పడిపోతుంది. ప్రస్తుతం పది మంది సభ్యులతో రెండవ పెద్ద పార్టీగా ఉన్న వైసిపి జూన్ తర్వాత మెజారిటీ సాధించబోతోంది. ప్రస్తుతం వైసీపీకి మండలి లో 12 మంది బలం ఉంది. అటు వైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కి 25 మంది సభ్యుల బలం ఉంది. అందుకే సీఆర్డీయే చట్టం సవరణ, మూడు రాజధానులు ఏర్పాటు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టినప్పుడు టీడిపి వారు అడ్డుకున్నారు.
అన్నీ చుట్టేస్తారు…
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… జూన్ నాటికి వైసిపి బలం మండలిలో 29కి పెరుగుతుంది. వీటిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కాబోయేవి, గవర్నర్ కోటాలో నామినేట్ చేయవలసిన ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావాల్సిన పదవులన్నీ అధికార పార్టీకే దక్కుతాయని కొత్తగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా మార్చి నెలాఖరు లోపు ఎమ్మెల్యేల కోటా స్థానంలో భర్తీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోకే వస్తాయి. పైగా మే 24వ తేదీ మరొక మూడు పదవులు కూడా ఖాళీ అవుతాయి.
YS Jagan కి ఇక తిరుగులేదు…
స్థానిక సంస్థల కోటాలో జూన్ 18 నాటికి 11 స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఈ కోటాలోనే టిడిపికి చెందిన ఏడుగురు సభ్యులు రిటైర్డ్ అయిపోతారు. అది కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడతాయి. మే 24న మూడు స్థానాలతో పాటు మార్చిలో మరొక ఐదు స్థానాలను భర్తీ చేస్తారు. మొత్తం కలిపి జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన నాలుగు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా పూర్తి అవుతుంది. అలా మొత్తం వైసీపీ సభ్యుల బలం 29కి పెరుగుతుంది. ఆ తర్వాత జగన్ అసెంబ్లీలో ఆడిందే ఆట పాడిందే పాట.