Tirumala : తిరుమల శ్రీవారికి పోస్కో సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. శుక్రవారం ఆ సంస్థ సీఈఓ సంజయ్ పాసి, ఆయన సతీమణి శాలిని పాసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పది కోట్ల విరాళాన్ని అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్ కు రూ.9కోట్లు, సర్వశ్రేయస్సు ట్రస్ట్ కు రూ.కోటి విరాళం డీడీలను ఆలయ ఏఇఓ ధర్మారెడ్డికి వారు అందజేశారు. దాతలకు వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.
మరో వైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో టీటీడీ ఆన్ లైన్ అర్జిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మార్చి నెల వర్చువల్ టికెట్ల కోటా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టికెట్లు ఉన్నాయి. టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటి నుండే వర్చువల్ విధానంలో సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.