KCR: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతటి చిత్రమైన పాలిటిక్స్లో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బొమ్మతో గెలిచిన ఓ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం గలం విప్పుతున్నారు. ఆయన టార్గెట్ చేసింది ఎవరో తెలుసా? ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల. ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానంటూ వైఎస్ షర్మిల చేసిన కామెంట్లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సెటైర్లు వేశారు.
షర్మిల ఏమన్నారంటే….
ఖమ్మంలో నిర్వహించిన సభలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను వైఎస్ షర్మిల టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పార్టీలు కొమ్ము కాస్తున్నాయని అందుకే తాను తెలంగాణ ప్రజల కోసం స్పందిస్తానని వెల్లడించారు. దీనిపై ఇటీవలే టీఆర్ఎస్లో విలీనం అయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘాటు కామెంట్లు చేశారు. పదవుల కోసం రాసి ఇచ్చినవారి సినిమా డైలాగులను వైఎస్ షర్మిల చదువుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన…సినిమా స్క్రిప్ట్, డైలాగులు చదువుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు.
నమ్మే చాన్స్ లేదు షర్మిల
ఖమ్మంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల అవాకులు, చవాకులు పేలారని మండిపడ్డ వీరయ్య.. ఆమెకు సీఎం కేసీఆర్ని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం లేదని కామెంట్ చేసిన ఆయన.. అరాచక పాలన కొనసాగుతుందని.. మీ అన్న మీద పోరాటం చేయలేక తెలంగాణకు వచ్చి ఇక్కడే పోరాటం చేస్తానని, ప్రశ్నించే గొంతుకు అవుతానని అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. షర్మిల నేను తెలంగాణవాదీని అని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరని.. మీరు ఎప్పుడు ఆంధ్ర వాదేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.