Etela rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు.
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఈటల రవీందర్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ముందుగా నియోజకవర్గంలోని తన అభిమానులతో ఈటల సమావేశం నిర్వహించారు. ఆ తరువాత వివిధ పార్టీలలో తమ సన్నిహితులతో ఈటల సమావేశం అయ్యారు. ఈ తరుణంలో కొత్త రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. ఏదైనా పార్టీలో చేరాలా లేక రాజకీయ పార్టీ పెట్టడమా అన్న విషయంపై సుదీర్ఘ మంతనాల అనంతరం బీజేపీలో చేరేందుకు ఈటల డిసైడ్ అయ్యారు. బీజేపీ నాయకత్వం కూడా ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరిపారు. తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత, కేంద్ర శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈటలతో చర్చలు జరిపిన అనంతరం రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి జేపి నడ్డాను కలిసి చర్చించారు. ఈటలకు ఉన్న డౌట్ లను నడ్డా వద్ద క్లారిఫై చేసుకున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More: Minister Harish Rao: ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందన ఇదీ..!!
2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటల 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2004 నుండి 2009 వరకూ అసెంబ్లీలో టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఆ తరువాత హుజూరాబాద్ నుండి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుండి 2019 వరకూ ఆర్థిక శాఖ మంత్రిగా, 2019 నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.