Telangana Politics: హైదరాబాద్ కు చెందిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేసిఆర్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక విషయంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల తనతో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో చర్చించిన తరువాతే ఢిల్లీకి వెళ్లారన్నారు. ఈటల చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్న కిషన్ రెడ్డి .. నియంత పాలన సాగిస్తున్న కేసిఆర్ ను గద్దె దించడానికి అందరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కొవడానికే పార్టీని బలోపేతం చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈటల ఈ రోజు ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలువనున్నారని చెప్పారు.
ఈటల చేరికపై ఆ నియోజకవర్గ బీజేపీ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిగా ఉన్నరన్న విషయంపై దాన్ని పార్టీలో చర్చిస్తామన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రాన తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు కిషన్ రెడ్డి. టిఆర్ఎస్ నేతలకు కేసిఆర్ ను పొగడటం, మోడీకి చెడును ఆపాదించి విమర్శలు చేయడం సహజమేనన్నారు.
Read More: YSRCP: ఈడీ కేసులో లేరు.. సాయిరెడ్డికి శాపమా – వరమా..!?
భూకబ్జా ఆరోపణలతో కేసిఆర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేంద్ర రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు నిన్న వెళ్లిన సంగతి తెలిసిందే. ఈటల బీజేపీలో చేరనున్నారని, ముహూర్తం కూడా ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీలో చేరడం ఖాయమని స్పష్టం అవుతుంది. ఈ సందర్భంలోనే నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను నేడు ఈటల కలవనున్నారని కిషన్ రెడ్డి చెప్పడం ఈటల బీజేపిలో చేరికపై క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.